ఐపీఎల్-2024 సీజన్ను విజయంతో ముగించాలనుకున్న ముంబై ఇండియన్స్కు నిరాశే మిగిలింది. ఆఖరి మ్యాచ్లోనూ ఓటమిపాలైంది. వాంఖడే వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. మొత్తంగా కేవలం నాలుగు మ్యాచ్లే గెలిచి పాయింట్ల పట్టికలో పదో స్థానంతో ఈ సీజన్ను ముగించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 214 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (75; 29 బంతుల్లో, 5x4, 8x6), కేఎల్ రాహుల్ (55; 41 బంతుల్లో, 3x4, 3x6) అర్ధశతకాలతో రాణించారు. ఆయుష్ బదోని (22*, 10 బంతుల్లో, 1x4, 2x6) దూకుడుగా ఆడాడు. నువాన్ తుషారా (3/28), పీయూష్ చావ్లా (3/29) చెరో మూడు వికెట్లతో సత్తాచాటారు.

అనంతరం ఛేదనలో ముంబై 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన రోహిత్ శర్మ (68; 38 బంతుల్లో, 10x4, 3x6) టాప్ స్కోరర్. నమన్ ధిర్ (62*; 28 బంతుల్లో, 4x4, 5x6) పోరాడాడు. రవి బిష్ణోయ్ (2/37), నవీనుల్ (2/50) తలో రెండు వికెట్లు తీశారు. రోహిత్ క్రీజులో ఉన్నంత వరకు ముంబై ఫేవరేట్గా నిలిచింది. కానీ హిట్ మ్యాన్ ఔటైన అనంతరం మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఆఖర్లో నమన్ పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించింది.
అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ 'జియో సినిమా'తో మాట్లాడాడు. ఈ సీజన్లో తన స్థాయికి తగిన ప్రదర్శన చేయలేదని అన్నాడు. అతిగా ఆలోచించకుండా, తన ఆటపైనే దృష్టి పెడుతున్నానని పేర్కొన్నాడు. ఈ సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన 32 సగటు, 150 స్ట్రైక్ రేటుతో 417 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ ఉంది.
''ఓ బ్యాటర్గా స్థాయికి తగ్గట్లుగా నేను ఆడట్లేదని తెలుసు. కానీ ఇన్నేళ్లు ఆడిన అనుభవంతో నేను దీని గురించి అతిగా ఆలోచించకూడదు. ఒకవేళ ఓవర్ థింక్ చేస్తే, నేను బాగా ఆడలేను. మంచి మైండ్ సెట్తో, సరైన్ జోన్లో ఉంటూ, ప్రాక్టీస్ చేస్తూ, నా ఆటలోని లోపాలను మెరుగుపర్చుకోవడం కోసమే ప్రయత్నిస్తాను'' అని రోహిత్ అన్నాడు. మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగాటోర్నీలో హిట్ మ్యాన్ ఫామ్లో ఉంటే టీమిండియాకు తిరుగుండదు.