విశాఖపట్నం: ఐపియల్లో అత్యధిక పారితోషికం ఇవ్వాలని తాను ఎవరితోనూ చెప్పలేదని ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు, స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టోర్నీలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఒత్తిడిని ఎదుర్కుంటున్నారా అని ప్రశ్నిస్తే - అలాంటి ఒత్తిడేమీ లేదని, తనకు డబ్బు ప్రధానం కాదని ఆయన జవాబిచ్చాడు.
కోట్ల రూపాయలు ఇవ్వకపోయినా తాను ఐపియల్ ఆడేవాడినని, అయినా కోట్ల రూపాయలు ఇవ్వాలని తాను ఎవరితోనూ చెప్పలేదని యువీ అన్నాడు. వేలం జరుగుతున్న సమయంలో తాను నిద్రపోతున్నట్లు ఆయన తెలిపారు.

వేలంలో 16 కోట్ల రూపాయలు పెట్టి యువరాజ్ సింగ్ను ఢిల్లీ డేర్డెవిల్స్ యాజమాన్యం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచు కోసం ఆయన విశాఖపట్నం వచ్చాడు. ఐపియల్లో రాణించి భారత జట్టులోకి రావాలని ఆశిస్తున్నారా అని అడిగితే అంత దూరం ఆలోచించడం లేదని సమాధానం ఇచ్చారు.
ప్రస్తుతం క్రికెట్ను ఆస్వాదిస్తున్నట్లు తెలిపాడు. జట్టుగా తిరిగి ఢిల్లీని గాడిలో పడేయంపైనే తాము దృష్టి సారించామని యువీ చెప్పాడు. జట్టు నైతిక బలాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. భారత జట్టు కోచ్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి సంబంధాలే తనకు గ్యారీ కిర్స్టన్తో ఉన్నాయని చెప్పాడు.