హైదరాబాద్: ఓ దిగ్గజాన్ని ఆటతీరును ఫాలో అయితే మంచి పేరొస్తుంది. కానీ, అతనింకా ఆడుతుండగానే ఆ పని చేసేస్తే.. మనం చేసే పని కూడా మరుగునపడిపోతుంది. అలా అయింది దినేశ్ కార్తీక్ పరిస్థితి కూడా.. మహేంద్రసింగ్ ధోని టీమిండియాలోకి వచ్చాక దేశంలో మిగతా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అందరికీ బ్రేక్ పడిపోయింది. అతడికి ఎవ్వరూ పోటీ ఇవ్వలేకపోయారు. ఏదైనా కారణంతో ధోని తప్పుకున్నపుడు లేదా రిజర్వ్ వికెట్ కీపర్ను ఎంచుకోవాల్సి వచ్చినపుడు మాత్రమే వేరే వాళ్లకు అవకాశాలు లభించాయి.
ధోని దూకుడు, చాకచక్యంతో కూడిన కెప్టెన్సీ వల్ల చాలామంది వికెట్ కీపర్ బ్యాట్స్మెన్కు అవకాశాలు లేకపోయాయన్న అభిప్రాయం ఉంది. ఐతే ఈ విషయంలో తనకైతే ఎలాంటి బాధా లేదని అంటున్నాడు దినేశ్ కార్తీక్. ఇంచుమించు ధోనీతో పాటే కెరీర్ మొదలుపెట్టిన దినేశ్ కార్తీక్కు ఎలాంటి అవకాశాలు రాలేదు. అయినా ఏ పరవాలేదంటున్నాడు. ధోని లాంటి దిగ్గజ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్కు చోటు కోల్పోవడం సంతోషమే అని అతనన్నాడు.
పాపను కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు పడే వేదన వర్ణానాతీతం.. మీ సాయం కావాలి
''నేను అంత గొప్పగా ఏమీ ఆడలేదు. నిలకడ కొరవడింది. భారత జట్టులో చోటుకు విపరీతమైన పోటీ ఉన్నపుడు నాకు అవకాశం రాలేదు. ముఖ్యంగా ధోని అనేవాడు నా కంటే చాలా ఎత్తులో ఉన్నాడు. అతను ప్రపంచ క్రికెట్లో ప్రకంపనలు రేపాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా అతను పేరు తెచ్చుకున్నాడు. నేను సాధారణ క్రికెటర్కు స్థానం కోల్పోలేదు. ధోని చాలా ప్రత్యేకమైన ఆటగాడు. అతడిపై నాకెంతో గౌరవం ఉంది. నేను జట్టులో కొనసాగడానికి అవసరమైన ఆట ఆడలేదు. ఈ విషయంలో నాతో నేను నిజాయితీగా ఉండాలి. ఇప్పుడు నాకు మరో అవకాశం లభించింది. అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తా' అని కార్తీక్ చెప్పాడు.
కొంత కాలంగా వన్డేల్లో రెగ్యులర్ వికెట్ కీపర్గా ఉంటున్న కార్తీక్.. వృద్ధిమాన్ సాహా గాయపడటంతో అఫ్గానిస్థాన్తో గురువారం ఆరంభమయ్యే మ్యాచ్ కోసం టెస్టు జట్టులోనూ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.