
అస్సలు నిద్ర పట్టలేదు
ఐపీఎల్లో ఆడటానికి, టీమిండియాకు ఆడటానికి చాలా తేడా ఉందని వరుణ్ చక్రవర్తి అన్నాడు. తొలిసారి భారత జట్టు తరఫున ఆడిన సందర్భాన్ని అతడు గుర్తుచేసుకున్నాడు. 'తొలిసారి భారత జట్టు తరఫున ఆడిన తర్వాత రోజు అస్సలు నిద్ర పట్టలేదు. ఏమాత్రం నమ్మశక్యంగా అనిపించలేదు. నా కడుపులో ఎదో తెలియని భయం. ఏం చేయాలో తెలియలేదు. ఇక ముందు రోజు కూడా నిద్రపోలేదు. టీమిండియాలో ఆడటం ప్రత్యేక అనుభవం. ఐపీఎల్లో ఆడటానికి, టీమిండియాకు ఆడటానికి చాలా తేడా ఉంటుంది. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఖచ్చితంగా భిన్న అనుభూతి ఉంటుంది. బాధ్యతగా ఆడాలనే విషయం నాకు బాగా గుర్తొచ్చేది' అని వరుణ్ చక్రవర్తి అన్నాడు.

శనక తొలి వికెట్
గత జులైలో శ్రీలంకలో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా తరఫున మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తొలిసారిగా ఆడాడు. అరంగేట్ర మ్యాచులో 28 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ప్రత్యర్థి కెప్టెన్ దాసున్ శనక అతడి తొలి వికెట్. మూడు మ్యాచ్ల టీ20ల సిరీస్లో వికెట్లు పడగొట్టకున్నా.. పరుగులను మాత్రం బాగానే నియంత్రించాడు. వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం ఐపీఎల్ 2021 రెండో దశ కోసం సిద్ధమవుతున్నాడు. ఇందుకోసం ఇప్పటికే యూఏఈ చేరుకొని ప్రాక్టీస్ చేస్తున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు అతడు కీలక స్పిన్నర్ అన్న విషయం తెలిసిందే.

13వ ఏట నుంచే
తమిళనాడుకు చెందిన వరుణ్ చక్రవర్తి 13వ ఏట నుంచి క్రికెట్ ఆడుతున్నాడు. 17వ ఏట వరకు వికెట్ కీపర్గా ఏజ్ గ్రూప్ క్రికెట్లో ఆడాడు. అయితే అక్కడ ప్రతిభను నిరూపించుకోలేకపోయాడు. నిరాశకు గురైన వరుణ్ ఆటను వదిలి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ డిగ్రీలో చేరాడు. ఆ తర్వాత ఫ్రీలాన్స్ ఆర్కిటెక్ట్గా పని చేస్తున్నా.. క్రికెట్ను మర్చిపోలేకపోయాడు.
దీంతో మళ్లీ క్రికెట్ వైపు అడుగులు వేశాడు. క్రోమ్బెస్ట్ క్రికెట్ క్లబ్లో సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్గా చేరాడు. కానీ మోకాలి గాయం రూపంలో దురదృష్టం మరోసారి వెంటాడింది. ఆ తర్వాత స్పిన్నర్గా కొత్త ఇన్నింగ్స్ ఆరంభించాడు. టెన్నిస్ బాల్ క్రికెట్లో బ్యాట్స్మెన్ ఊచకోత నుంచి తప్పించుకోవడానికి ఆర్కిటెక్ట్ బుర్రతో తన బౌలింగ్కు పదునుపెట్టాడు. తనను తాను మిస్టీరి స్పిన్నర్గా ఆవిష్కరించుకున్నాడు. కొంతకాలం క్లబ్ క్రికెట్లో రాణించాడు.

తమిళనాడు ప్రీమియర్ లీగ్తో వెలుగులోకి
2018లో తమిళనాడు ప్రీమియర్ లీగ్తో సత్తా చాటేందుకు వరుణ్ చక్రవర్తికి అవకాశం వచ్చింది. ఆ లీగ్లో మధురై పాంథర్స్ తరఫున ఆడిన వరుణ్.. ఆ జట్టుకు తొలి టైటిల్ అందించాడు. దాంతో ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ నెట్స్లో కూడా బౌలింగ్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ సమయంలో కోల్కతా జట్టు స్పిన్నర్ సునీల్ నరైన్, స్పిన్ కోచ్ కార్ల్ క్రో వద్ద మెళకువలు నేర్చుకున్నాడు.
ఆపై తమిళనాడు తరఫున విజయ్ హజారే ట్రోఫీలో ఆడి సత్తాచాటాడు. రంజీల్లో కూడా ఆడాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ తరఫున ట్రయల్స్లో కూడా పాల్గొన్నాడు. 2019 ఐపీఎల్ వేలంలో రూ. 20 లక్షల కనీస ధర ఉన్న వరుణ్ను.. పంజాబ్ ఏకంగా రూ. 8.4 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ వరుణ్ సత్తాచాటలేకపోయాడు. దీంతో పంజాబ్ వదిలేసింది. 2020లో కోల్కతా నైట్ రైడర్స్ రూ. 4 కోట్లకు దక్కించుకుంది. ఈసారి అద్భుతంగా రాణించాడు.

ఏకంగా ప్రపంచకప్ జట్టుకు ఎంపిక
వరుణ్ చక్రవర్తి ఐపీఎల్ 2020లో కోల్కతా నైట్రైడర్స్ జట్టులో ఆడి మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఓ మ్యాచులో ఏకంగా ఐదు వికెట్లతో మ్యాచ్ విన్నర్గా నిలిచాడు. ఈ ప్రదర్శన బీసీసీఐ సెలెక్టర్లను ఆకర్షించింది. దాంతో ఆసీస్ పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో అతడు చాన్స్ కొట్టేశాడు. కానీ భుజం నొప్పితో బాధపడుతున్నందు వల్ల ఈ స్టార్ స్పిన్నర్ టీ20 సిరీస్కు దూరమయ్యాడు. ఐపీఎల్ 2021లో సత్తాచాటాడు. ఇక జులైలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీసుకు ఎంపికై.. ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ టోర్నీలో రాణించడం, యూఏఈలో అనుభవం ఉండడంతో ఇప్పుడు వరుణ్ టీ20 ప్రపంచకప్ 2021కు ఎంపికయ్యాడు.

భారత టీ20 ప్రపంచకప్ జట్టు
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ (స్టాండ్ బై ప్లేయర్లుగా శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్).


Click it and Unblock the Notifications

స్టార్ ఆల్రౌండర్కు షాక్.. ఆరేళ్ల తర్వాత ఆ ప్లేయర్కి చోటు! జట్టునిండా హిట్టర్లే.. విండీస్ టీ20 టీమ్ ఇదే!










