ఐపీఎల్లో అరంగేట్ర మ్యాచ్లోనే ఇంతకంటే గొప్ప ఆరంభాన్ని కోరుకోలేదని వెస్టిండీస్ పేసర్, ముంబై ఇండియన్స్ ఆటగాడు అల్జారి జోసెఫ్ తెలిపారు. శనివారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానం (ఉప్పల్)లో సన్రైజర్స్ హైదరాబాదుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబై పేసర్ జోసెఫ్ ఆరు వికెట్లతో సన్రైజర్స్ ఆటగాళ్లను హడలెత్తించాడు. జోసెఫ్ దాటికి సన్రైజర్స్ 96 పరుగులకే ఆలౌట్ అయింది. జోసెఫ్కే 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
ప్రణాళికలప్రకారం మ్యాచ్ ఆడాను:
ఈ సందర్భంగా అల్జారి జోసెఫ్ మాట్లాడుతూ... 'ఇది నా కల. ఇంతకంటే గొప్ప ఆరంభాన్ని కోరుకోలేదు. నా ప్రదర్శనతో చాలా సంతోషంగా ఉన్నా. ప్రణాళికల ప్రకారం మ్యాచ్ ఆడాను. ప్రణాళికలను సరైన మార్గంలో ఆచరణలో పెట్టి విజయం సాధించా. ముంబై మ్యాచ్ గెలవాలని చాలా మంది కోరుకుంటున్నారు. అందుకే ఆట మీదే పూర్తి దృష్టి పెట్టాను. జట్టులోని మిగతా ఆటగాళ్లు కూడా బాగా ఆడారు. కోచ్లు కూడా వారి బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. వారు ఎల్లవేళలా సహాయపడుతున్నారు' అని అల్జారి జోసెఫ్ తెలిపారు.
మాజీల ప్రశంసలు:
మొదటి మ్యాచ్లోనే అల్జారి జోసెఫ్ చేసిన ప్రదర్శనపై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'ముంబయి ఇండియన్స్ పోరాటం అద్భుతం. పేసర్ అల్జారి జోసెఫ్ ప్రదర్శన బాగుంది' అని సచిన్ టెండూల్కర్ అన్నారు. 'జోసెఫ్కు ఇది ఓ మంచి అరంగేట్రం. ఇంతవరకు జోసెఫ్ వెస్టిండీస్ తరపున టీ20 ఆడలేదు. అయినా ఇంత మంచి ప్రదర్శన చేశాడు' అని మహమ్మద్ కైఫ్ పేర్కొన్నారు.