
హైదరాబాద్: గురువారం ముగిసిన ఐపీఎల్ వేలంలో దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ను చివరి నిమిషంలో కనీసధర రూ. 2 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వేలంలో తనను ఆర్సీబీ కొనుగోలు చేయడంపై డేల్ స్టెయిన్ సంతోషం వ్యక్తం చేశాడు. తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
ఈ సందర్భంగా ఆర్సీబీ అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు డేల్ స్టెయిన్ తనదైన శైలిలో స్పందించాడు. ఈ సారైనా ఆర్సీబీ ఐపీఎల్-2020 ట్రోఫీ గెలుస్తుందా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు గాను "తప్పక గెలుస్తుంది. ఎందుకుంటే అక్కడ ఉంది నేను. ఈసారి వీలైనన్ని ఎక్కువ వికెట్లు తీయాలి. వికెట్లతో పాటు ట్రోఫీ సాధించి తీరాలి" అంటూ డేల్ స్టెయిన్ సమాధానమిచ్చాడు.
వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేయడంపై "ఆనందంతో పాటు బాధ్యత పెరిగింది" అంటూ డేల్ స్టెయిన్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్లో ఇప్పటివరకు 92 మ్యాచ్లు ఆడిన డేల్ స్టెయిన్ 100 వికెట్ల మైలురాయిని అందుకునేందుకు కేవలం 4 వికెట్ల దూరంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన మాన్షీ సూపర్ లీగ్లో సైతం డేల్ స్టెయిన్ అద్భుతమైన ఫామ్ని కనబర్చాడు. స్టెయిన్తో పాటు రిచర్డ్సన్, మోరిస్, ఉదానలతో ఆర్సీబీ బౌలింగ్ దుర్బేద్యంగా ఉంది.
గత సీజన్లో ఆర్సీబీ తరుపున డెల్ స్టెయిన్ కేవలం రెండు మ్యాచ్లకే పరిమతమయ్యాడు. గాయం కారణంగా మిగతా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో వేలానికి ముందు డేల్ స్టెయిన్ను ఆర్సీబీ వదులుకుంది. అయితే, వేలంలో తిరిగి కనీసధరకే కొనుగోలు చేసింది. వేలంలో స్టెయిన్ను కెప్టెన్ కోహ్లీతో చర్చించాకే కొనుగోలు చేశామని ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెసన్ అన్నాడు.