ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, మిచెల్ జాన్సన్ వివాదం గురించి గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాల్ టాంపరింగ్ చేసిన వార్నర్ కు టెస్టుల్లో ఘన వీడ్కోలు ఎందుకంటూ జాన్సన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. మరోవైపు ఆసీస్ ఆటగాళ్లు వార్నర్ కు మద్దుతు తెలుపుతున్నారు.
తాజాగా ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ కూడా వార్నర్ కు సపోర్ట్ చేశాడు. ''మా జట్టులో ఒకరికొకరం అండగా ఉంటాం. వార్నర్, స్మిత్ తో గత 12 ఏళ్లుగా కలిసి క్రికెట్ ఆడుతున్నాం. పాజిటివ్ అంశాల గురించి ఆలోచించాలి. మా కెరీర్ లో దాదాపు 100 మంది ఆటగాళ్లతో కలిసి ఆడుంటుంటాం. అందరూ అద్భుత ఆటగాళ్లే. అయితే జాన్సన్ ఎందుకలా అన్నాడో అతడినే అడగాలి'' అని కమిన్స్ వెల్లడించాడు.

మరోవైపు జాన్సన్ వ్యాఖ్యలపై డేవిడ్ వార్నర్ స్పందించాడు. తమ అభిప్రాయాలని వ్యక్తం చేసుకోవడానికి అందరికీ స్వేచ్ఛ ఉంటుందని, అయితే అన్నింటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు. తన టెస్టు కెరీర్ కు గొప్ప ముగింపు తప్పక లభిస్తుందని వార్నర్ పేర్కొన్నాడు. అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాక విమర్శలు వస్తుంటాయని, వాటిలో కొన్ని సానుకూలాంశాలు ఉంటాయని, ముఖ్యమైనదే తీసుకోవాలని తెలిపాడు.
వార్నర్-జాన్సన్ మధ్య కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నానని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ అన్నాడు. సమస్యను చర్చించుకొని పరిష్కరించుకోవాలని సూచించాడు. ఈ వివాదానికి ముగింపు పలకడానికి తాను చేయాల్సిన పనికి టైమ్ వచ్చినట్లు ఉందని అన్నాడు. మీడియా వేదికగా కాకుండా పర్సనల్ రూమ్ లో ఇద్దరితో చర్చించి గొడవకు ముగింపు పలకడానికి రెడీగా ఉన్నట్లు తెలిపాడు. యాషెస్ సిరీస్ ఎంపిక సమయంలో ఈ వివాదానికి నాంది పలికి ఉంటుందని భావిస్తున్నాని పాంటింగ్ చెప్పాడు.
కాగా, పాకిస్థాన్ తో స్వదేశంలో ఆస్ట్రేలియా మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. తొలి టెస్టు డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది.