
హైదరాబాద్: భారత జట్టులో చోటు కోసం తాను ఎదురుచూస్తున్నట్లు భారత యువ బ్యాట్స్మెన్ శుభమాన్ గిల్ వెల్లడించాడు. అండర్-19 వరల్డ్ కప్ ద్వారా వెలుగులోకి వచ్చిన యువ ఆటగాళ్లు పృథ్వీ షా, శుభమాన్ గిల్. న్యూజిలాండ్ వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్ కప్లో భారత జట్టు ఛాంపియన్గా నిలవడంలో వీరిద్దరూ కీలకపాత్ర పోషించారు.
అందరూ అనుకున్నట్లే పృథ్వీషా ఇటీవల వెస్టిండిస్తో ముగిసిన రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో అరంగేట్రం చేశాడు. దీంతో శుభమాన్ గిల్ అరంగేట్రం కూడా త్వరలోనే ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ తరఫున సత్తాచాటిన శుభమాన్ గిల్ గురువారం భారత్-ఎ జట్టుతో జరిగిన దేవధర్ ట్రోఫీలోనూ శుభమన్ గిల్ (106 నాటౌట్) రాణించాడు.
దీంతో శుభమాన్ గిల్ ప్రాతినిథ్యం వహిస్తున్న భారత్-సి జట్టు టోర్నీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్కి భారత సెలక్టర్లు కూడా హాజరవడంతో శుభమాన్ గిల్ విండిస్తో వన్డే సిరీస్ కోసం భారత జట్టులోకి ఎంపిక చేస్తారని అంతా భావించారు. అయితే, సెలక్టర్లు శుభమాన్ గిల్కి మొండిచేయి చూపించారు.
ఈ సందర్భంగా శుభమాన్ గిల్ మాట్లాడుతూ "భారత జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. వెస్టిండీస్తో వన్డే సిరీస్లో నాకు అవకాశం రాలేదు. అయితే తప్పకుండా వచ్చే సిరీస్లో అవకాశం దక్కించుకుంటా" అని అన్నాడు.
దేశవాళీలో మంచి స్కోర్లు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని శుభమాన్ గిల్ వెల్లడించాడు. ఐదు వన్డేల సిరిస్లో భాగంగా శనివారం పుణె వేదికగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. ఈ వన్డేకి ముందు సెలక్టర్లు చివరి మూడు వన్డేల కోసం గురువారం జట్టుని ప్రకటించారు.
భారత్ జట్టు:
విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, రిషబ్ పంత్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, మనీశ్ పాండే