న్యూ ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో వచ్చే ఏడాది క్రికెటర్ హర్భజన్ సింగ్ మరో కొత్త జట్టుకు ఆడనున్నాడని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే తనకు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)లో ఎలాంటి ఇబ్బందులు లేవన్నాడు బజ్జీ. తనపై ప్రచారంలో ఉన్న వదంతులు నమ్మవద్దన్నాడు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచీ 10 సీజన్లు ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడిన హర్భజన్ గత సీజన్లో చెన్నై జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.
ఎంఎస్ ధోని నేతృత్వంలో చెన్నై ఐపీఎల్ 11 ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 12లో హర్భజన్ ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఆడతాడని, కుదరని పక్షంలో ఆ టీమ్ మెంటార్గా బాధ్యతలు నిర్వహిస్తాడని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే అలాంటి వదంతులు నమ్మవద్దని భజ్జీ కోరాడు. 'చెన్నై జట్టులో నాకు ఏ ఇబ్బంది లేదు. గొప్ప ఫ్రాంచైజీకి ఆడటాన్ని గౌరవంగా భావిస్తా. ఒకవేళ వేరే జట్టుకు మారాలనుకుంటే నేనే చెబుతా. తన విషయాల వరకు నన్ను మించిన న్యూస్ సోర్స్ లేదని' హర్భజన్ అభిప్రాయపడ్డాడు.
క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించని తాను.. ఢిల్లీ జట్టుకు మెంటార్గా ఎందుకు వ్యవహరిస్తానని ప్రశ్నించారు. 149 ఐపీఎల్ మ్యాచ్లాడిన భజ్జీ 134 వికెట్లను సొంతం చేసుకున్నాడు. కాగా, ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్లో 13 మ్యాచ్లు ఆడి కేవలం 7 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. దశాబ్దానికి పైగా ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించాడు.
ఈ ఏడాది ప్రదర్శనల ఆధారంగా జట్లలో మార్పులు చేపడతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కొత్త మేనేజ్మెంట్ తీసుకోవాలని ఆశిస్తోంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గ్యారీ కిస్టన్ను తమ జట్టుకు ప్రధాన కోచ్గా ఇప్పటికే ఖరారు చేసేసింది. రాజస్థాన్ రాయల్స్ షేన్ వార్న్ను కొనసాగించనుంది. ఇక లీగ్కు సంబంధించి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతుండటంతో ఐపీఎల్ వేదికను యూఏఈకి గానీ, లేదా దక్షిణాఫ్రికాకు గానీ మార్చాలనే యోచనలో ఉంది నిర్వహక సంఘం.