ఐపీఎల్-2024 విజేతగా కోల్కతా నైట్ రైడర్స్ నిలిచింది. ఫైనల్లో సన్రైజ్స్ హైదరాబాద్పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్కు ఇది మూడో టైటిల్. 2012, 2014లోనూ కోల్కతా ఛాంపియన్గా అవతరించింది. అయితే ట్రోఫీ అందుకున్న అనంతరం కేకేఆర్ ప్లేయర్లంతా ఫ్లైయింగ్ కిస్తో సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
ఈ సీజన్లో ఫ్లైయింగ్ కిస్కు ప్రతేకమైన కథ ఉంది. సీజన్ ఆరంభంలో కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్లో కథ మొదలైంది. మయాంక్ అగర్వాల్ను ఔట్ చేసిన అనంతరం కోల్కతా బౌలర్ హర్షిత్ రాణా కాస్త దూకుడుగా సంబరాలు చేశాడు. మయాంక్ దగ్గరగా వచ్చి గాల్లోకి ముద్దులు విసిరి, బయటకు వెళ్లమని సంజ్ఞ చేశాడు. దీంతో ఐపీఎల్ కౌన్సిల్ అతనికి జరిమానా విధించింది. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్లోనూ హర్షిత్ అదే సెలబ్రేషన్స్ రిపీట్ చేశాడు.

ఈ సారి హర్షిత్ రాణాపై ఓ మ్యాచ్కు నిషేధం విధించారు. దీని గురించి హర్షిత్ తాజాగా మాట్లాడాడు. ఆ సమయంలో ఎంతో బాధపడ్డానని, కేకేఆర్ యజమాని షారుక్ ఖాన్ తన దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పాడని తెలిపాడు. ఢిల్లీకు చెందిన ఆటగాళ్లు దూకుడుగా ఆడతారని పేర్కొన్నాడు. ఢిల్లీకి చెందిన హర్షిత్ 13 మ్యాచ్ల్లో 19 వికెట్లు సాధించి టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
''మైదానం అవతల నేనెంతో సరదాగా ఉంటాను. కానీ పిచ్లో అలా ఉండను. స్నేహం కోసం బరిలోకి దిగను. విజయం సాధించాలనే తపనతోనే ఉంటాను. నా ఓవర్లో అభిషేక్ పోరెల్ 16 పరుగులు కొట్టాడు. ఓ ప్రత్యర్థి మన బౌలింగ్లో సిక్సర్లు కొడుతుంటే నవ్వుతూ ఉండలేం కదా! ఆ తర్వాతి ఓవర్లో అతని వికెట్ నేనే తీశాను. సెలబ్రేషన్లు చేసుకున్నాను. కానీ నిషేధానికి గురయ్యాను''
''నిషేధానికి గురైన తర్వాత ఎంతో బాధపడ్డాను. ఆ సమయంలో షారుక్ ఖాన్ నా దగ్గరకు వచ్చారు. ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఫ్లైయింగ్ కిస్ సెలబ్రేషన్స్ చేద్దామని మాటిచ్చాడు. ట్రోఫీతో అదే చేశాం. ఢిల్లీ కుర్రాళ్లు మనసు పెట్టి ఆడుతుంటారు. ఢిల్లీ దూకుడే విరాట్ కోహ్లిని విరాట్ను చేసింది. ఇషాంత్ శర్మ 100 టెస్టులు ఆడాడు. గబ్బాలో పంత్ అద్భుతం చేశాడు. రెండు ప్రపంచకప్ ఫైనల్లో భారత్ను గంభీర్ గెలిపించాడు'' అని హర్షిత్ రాణా అన్నాడు.