టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ ఐపీఎల్ గురించి తన అనుభవాలను పంచుకున్నాడు. జట్టుకు నాయకత్వం వహిస్తున్నప్పుడు ఆటగాళ్లను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని పేర్కొన్నాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై పలికిన ధోనీ ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. గత సీజన్లో సీఎస్కేను విజేతగా నిలిపాడు.
అయితే సోమవారం ధోనీ చేసిన పోస్ట్తో అభిమానులు అయోమయంలో పడ్డారు. 'కొత్త సీజన్, కొత్త పాత్ర కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. వేచి చూడండి' అని ధోని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్ట్తో ధోనీ ఐపీఎల్కు వీడ్కోలు పలుకుతాడనే వాదనలు వినిపిస్తున్నాయి.

రిటైర్మెంట్ ప్రకటించి కోచ్గా లేదా మెంటార్గా ధోనీ బాధ్యతలు అందుకుంటాడని భావిస్తున్నారంతా. బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకుంటాడని, వికెట్ కీపింగ్ వదిలేస్తాడని మరికొందరు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ ధోనీకి సంబంధించిన వీడియో రిలీజ్ చేసింది. కానీ కాసేపటికే ఆ వీడియోను ట్విటర్ నుంచి తొలగించింది. తొలి సీజన్ నుంచి ఇప్పటివరకు తన ఐపీఎల్ ప్రయాణంలోని కీలక విషయాలు ధోనీ పంచుకున్నాడు. దీంతో ధోనీ రిటైర్మెంట్పై ఊహాగానాలు మరింత పెరిగాయి.
''2008లో ఆడిన సీఎస్కే జట్టు సమతూకంగా ఉంది. జట్టులో చాలా మంది ఆల్రౌండర్లు ఉన్నారు. మాధ్యూ హెడెన్, మైక్ హస్సీ, ముత్తయ్య మురళీధరన్, ఎన్తిని, జాకబ్ ఓరమ్ వంటి అనుభవజ్ఞులు జట్టులో ఉన్నారు. వారందరినీ ఒకే డ్రెస్సింగ్ రూమ్లో చేర్చడం, ఒకరినొకరు తెలుసుకోవడం ఓ సవాలుగా మారింది''
''జట్టుకు నాయకత్వం వహిస్తున్నప్పుడు ఒకరినొకరిని అర్థం చేసుకోవడం చాలా కీలకమని నేను భావిస్తాను. మీరు ఆటగాడి బలాలు, బలహీనతలు తెలిస్తే జట్టును సరైన దిశలో నడిపించడం సులభం అవుతుంది. చాలా మంది విదేశీ ఆటగాళ్లను అర్థం చేసుకోవడానికి ఐపీఎల్ నాకు అవకాశం ఇచ్చింది. ప్రత్యర్థి ఆటగాళ్లతో నేను ఎక్కువగా మాట్లాడే వ్యక్తిని కాదు. కానీ ఆటగాళ్ల గురించి తెలుసుకోవడానికి, వాళ్ల అభిప్రాయాలు, సంస్కృతిని అర్థం చేసుకోవడానికి ఐపీఎల్ అవకాశం ఇచ్చింది. ఇవన్నీ ఐపీఎల్ను ఆసక్తికరంగా మార్చాయి'' అని ధోనీ అన్నాడు.
ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ అయిదు ఐపీఎల్ టైటిళ్లు సాధించింది. అంతేగాక 2010, 2014లో ఛాంపియన్స్ లీగ్ టీ20 ట్రోఫీలను సొంతం చేసుకుంది.