కోల్కత్తా: ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డుగా బీసీసీఐ ఉంది. అలాంటి బీసీసీఐ ఆధ్యక్ష పదవిని చేపట్టేందుకు కావాల్సిన అర్హత తనకు లేదని టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారం అన్నాడు.
గత మంగళవారం శశాంక్ మనోహార్ బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీ ఆయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన గురువారం ఐసీసీ ఛైర్మన్గా ఎన్నికయ్యారు. నిజానికి బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టాలంటే కనీసం మూడు సార్లు వార్షిక సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది.
అయితే జగ్మోహాన్ దాల్మియా ఆకస్మిక మరణం తర్వాత గతేడాది అక్టోబర్ 15నే సౌరభ్ గంగూలీ క్యాబ్ అధ్యక్ష పదవిని స్వీకరించాడు. దీంతో మూడు వార్షిక సర్వసభ్య సమావేశాలకు హాజరయ్యే అవకాశం గంగూలీకి దక్కలేదు.
దీనివల్లనే బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీపడే అవకాశం తనకు లేదని భావిస్తున్నట్లు శుక్రవారం బంధన్ బ్యాంక్ పార్క్ స్ట్రీట్ బ్రాంచ్ని ఆవిష్కరించిన సందర్భంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. అయితే మరి ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కష్టమని చెప్పాడు.
బీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు చాలా మంది అనుభవం కలిగిన పెద్దలు ఉన్నారని, దాని గురించి తాను ఆలోచించడం లేదని తెలిపాడు. వచ్చే వరల్డ్ కల్లా ధోనిని వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి కోహ్లీకి ఆ బాధ్యతలు ఇవ్వాలంటూ ఇటీవల వ్యాఖ్యలు చేసి గంగూలీ వార్తల్లో నిలిచారు.