మొహాలి: భారత జట్టులో సీనియర్ స్పిన్నర్ పాత్రను ఆస్వాదిస్తున్నానని లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా తెలిపాడు. న్యూజిలాండ్తో ప్రస్తుతం జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్లో భాగంగా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల గైర్హాజరీతో జట్టులో చోటు దక్కించుకున్న అమిత్ మిశ్రా శనివారం మీడియాతో మాట్లాడాడు.
ప్రస్తుతం వన్డే సిరీస్ ఆడుతున్న భారత జట్టులోని యువ ఆటగాళ్లు తన నుంచి అనేక సలహాలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. యువ ఆటగాళ్లు మార్గనిర్దేశనం చేయడాన్ని తాను ఎప్పుడూ ఇష్టపడతానని మిశ్రా ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి'యువకులు సాయం కోరితే వారికి మెళకువలు నేర్పించడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. ఒక సీనియర్గా యువ బౌలర్లకు అండగా నిలవడమే నా బాధ్యత. జట్టులోని యువ క్రికెటర్లు నా నుంచి కొన్ని సూచనలు తీసుకుంటున్నారు. అలా అడిగిన వారికి కొన్ని టిప్స్ ఇస్తున్నా. ఒక గేమ్ ఆడేటప్పుడే కాకుండా, మిగతా సమయాల్లో కూడా యువ క్రికెటర్లకు నాకు చేతనైన సాయం చేస్తున్నా. ఈ పాత్రతో నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. ప్రత్యేకంగా అక్షర్ పటేల్, కేదార్ జాదవ్లతో నా అనుభవాన్ని పంచుకుంటున్నా' అని అమిత్ మిశ్రా అన్నాడు.
2003లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన అమిత్ మిశ్రా ప్రస్తుత సిరిస్లో చక్కగా రాణిస్తున్నాడు. కాగా, టీమిండియా ఛీప్ కోచ్ అనిల్ కుంబ్లేతో కలిసి పని చేయడం అద్భుతంగా ఉందని మిశ్రా పేర్కొన్నాడు. టెక్నిక్ గురించి మాట్లాడకుండానే జట్టులోని సభ్యుల్ని మానసికంగా బలంగా ఉంచడంలో కుంబ్లే తన పనిని సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాడని కొనియాడాడు.

తాను తుది జట్టులో లేకపోయినా, కుంబ్లే మ్యాచ్కు సంబంధించిన అనేక విషయాలను తనతో చర్చిస్తాడన్నాడని పేర్కొన్నాడు. కుంబ్లే కూడా ఓ బౌలర్ కావడంతో టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు, టెయిలెండర్లు ఒత్తిడిని ఏ విధంగా జయించాలనే దానిపై కూడా తమతో చర్చిస్తాడని మిశ్రా తెలిపాడు.
ఇది ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నాడు. ఈ వన్డే సిరిస్లో ఇప్పటివరకూ జరిగిన రెండు వన్డేల్లో మిశ్రా ఆకట్టుకున్నాడు. ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో మూడు వికెట్లు సాధించిన మిశ్రా.. ఢిల్లీ మ్యాచ్లో కూడా మూడు వికెట్లు తీసుకున్నాడు.
స్పిన్నర్లుగా తమ దృష్టంతా వికెట్లు తీయడంపైనే ఉంటుందని అన్నాడు. మ్యాచ్కి ముందు అనేక ప్లాన్లను వేస్తామని చెప్పుకొచ్చాడు. ఒక ప్లాన్ పనిచేయని పక్షంలో ప్లాన్ బి లేదా ప్లాన్ సిని ఆటలో అమలు చేస్తామని తెలిపాడు. ఢిల్లీ వన్డేలో మొదటి ప్లాన్ అమలు కాకపోడవంతో రెండో ప్లాన్ని అమలు చేశామని అన్నాడు.