హైదరాబాద్: ప్రస్తుతం తానొక కలల ప్రపంచంలో విహరిస్తున్నట్లు ఉందని ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్గా బరిలోకి దిగిన తన తొలి టెస్టులోనే జో రూట్ సత్తా చాటాడు. లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికాతో గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో సెంచరీతో చేలరేగాడు.
మొదటి రోజు మ్యాచ్ అనంతరం జో రూట్ మాట్లాడుతూ ప్రస్తుతం తాను కలల ప్రపంచంలో విహరిస్తున్నట్లు ఉందని చెప్పాడు. మ్యాచ్ ప్రారంభంలోనే లైఫ్ లభిస్తే, ఆ లైఫ్ని సద్వినియోగం చేసుకుంటే ఆ అనుభూతిని వర్ణించలేమని అన్నాడు.
'ఈ రోజు ఉదయం కాస్త ఆందోళన చెందా. అయితే ఆ తర్వాత ఎంతో ఎంజాయ్ చేశా. వందశాతం మెరుగైన ప్రదర్శన చేయకపోయినా భారీ స్కోరు చేసే దిశగా ప్రయత్నించా' అని మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో జో రూట్ పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే ఓ అరుదైన రికార్డుని అధగమించే సువర్ణావకాశం జో రూట్ ముందుంది. కెప్టెన్గా తొలి టెస్టులో న్యూజిలాండ్కు చెందిన గ్రాహం డౌలింగ్ చేసిన 239 పరుగుల రికార్డుని జో రూట్ ఈ టెస్టులో అధిగమించే ఛాన్స్ వచ్చింది. 1968లో గ్రాహం డౌలింగ్ ఈ రికార్డుని నెలకొల్పాడు.
కాగా, జో రూట్ (227 బంతుల్లో 184 బ్యాటింగ్; 26 ఫోర్లు, 1 సిక్స్) ప్రదర్శనతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 87 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. రూట్తో పాటు మొయిన్ అలీ (61 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
వీరిద్దరూ కలిసి ఆరో వికెట్కు అభేద్యంగా 167 పరుగులు జత చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 76 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు అలెస్టర్ కుక్ (3), జెన్నింగ్స్ (8), బాలెన్స్ (20), బెయిర్ స్టో (10) విఫలమయ్యారు.
ఈ దశలో జో రూట్, బెన్ స్టోక్స్ (56) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్కు 114 పరుగులు జోడించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలాండర్ మూడు వికెట్లతో సత్తా చాటాడు.