IPL 2025 Dhoni: ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణమైన ప్రదర్శనతో విమర్శలను మూటగట్టుకుంటోంది. ఆడిన ఐదు మ్యాచుల్లోనూ నాలుగింటిలో ఓడి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే ధోనీ విషయంలో తనపై సోషల్ మీడియాలో వస్తోన్న విమర్శలకు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గట్టిగానే స్పందించాడు. తనను ఎవరూ పీకేదేమీ లేదని పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడు. తనను దారుణంగా ట్రోల్ చేసిన వారి మూతిని తన వ్యాఖ్యలతో మూయించాడు.
అసలేం జరిగిందంటే?
రీసెంట్ గా జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్పై చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి చెందింది. అప్పుడు కామెంటరీ బాక్స్లో ఉన్న అంబటి రాయుడు - నవజ్యోత్ సింగ్ సిధ్దూ మధ్య జరిగిన ఓ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మ్యాచులో ధోనీ 16వ ఓవర్ చివర్లో బ్యాటింగ్కు వచ్చినప్పుడు, గ్యాలరీ మొత్తం "ధోనీ... ధోనీ..." అంటూ మార్మోగింది. అప్పుడు సిధ్దూ మాట్లాడుతూ.. "ధోనీ మెట్లపై నుంచి వేగంగా దిగుతున్నాడు. అతడిలో ఉన్న కసి ఆ దూకుడుగా దిగడంలోనే కనిపిస్తోంది " అని అన్నాడు. అప్పుడు రాయుడు వెంటనే.. "ధోనీ బ్యాట్తో కాదు, ఖడ్గంతో దిగుతున్నాడు. ఇవాళ రాత్రి ఊచకోతే." అంటూ బదులిచ్చాడు. మళ్లీ.. "ధోనీ క్రికెట్ ఆడటానికి కాదు, యుద్ధనికి వస్తున్నట్టుగా ఉంది" అని కూడా అన్నాడు. ఇంకా మహీ గురించి పలు వ్యాఖ్యలు కూడా చేశాడు. అయితే ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో మరో రకంగా ప్రచారమయ్యాయి. అంబటి రాయుడు సెటైరికల్ గా మాట్లాడినట్లు పలువురు అభిప్రాయపడ్డారు.

స్పందించిన రాయుడు..
దీంతో అంబటి రాయుడపై బాగా ట్రోలింగ్ చేశారు. ధోనీనే అంటావా అంటూ కూడా మండిపడ్డారు. మరి కొందరు మాత్రం అంబటి రాయుడు.. ధోనీని ప్రశంసించాడు, ట్రోల్ చేయలేదంటూ మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అంబటి రాయుడు.. మహీ గురించి మాట్లాడాడు. తానెప్పటికీ ధోనీకి అభిమానేనని చెప్పాడు.
అప్పుడు.. ఇప్పుడు.. ధోనీనే..
"అప్పుడు తలా అభిమానిని, ఇప్పుడు తలా అభిమాని, ఎప్పుడూ తలా అభిమానినే. ఎవరేం అనుకున్నా నేను పట్టించుకోను. ఎవరైనా ఏమి అనుకున్నా లేదా ఏం చేసినా పర్వాలేదు. దాని వల్ల ఒక్క శాతం కూడా ఒరిగేది ఏమీ ఉండదు. నన్ను చేసేది ఏం ఉండదు. కాబట్టి పెయిడ్ పీఆర్ పై డబ్బులు ఖర్చుపెట్టడం మానేయండి. ఏదైనా ఛారిటీకి డొనేట్ చేయండి. దీనివల్ల ఎంతో మంది పేదలు బాగుపడతారు." అని అంబటి రాయుడు చెప్పాడు.