తాను శ్రీరాముడి, హనుమంతుడి భక్తుడిని అని దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ తెలిపాడు. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనను భారత్ ఘనంగా ముగించిన సంగతి తెలిసిందే. అయితే వన్డే సిరీస్, టెస్టు సిరీస్లో కేశవ్ మహారాజ్ బ్యాటింగ్కు వచ్చిన ప్రతి సందర్భంలో స్టేడియంలో 'రామ్.. సియా రామ్' సాంగ్ ప్లే చేశారు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలోని 'రామ్.. సీతా రామ్' మెలోడియస్ హిందీ వెర్షన్ సాంగ్ అది.
అయితే తాను బ్యాటింగ్కు వచ్చినప్పుడు ఆ సాంగ్ ప్లే చేయడానికి గల కారణాలను కేశవ్ మహారాజ్ వివరించాడు. ''అది నా ఎంట్రీ సాంగ్. రాముడి, హనుమంతుడి భక్తుడిని. కాబట్టి స్టేడియంలో అడుగుపెట్టే సమయంలో అదే నాకు సరైన పాటగా భావిస్తున్నా'' అని కేశవ్ పేర్కొన్నాడు. భారత్-దక్షిణాఫ్రికా మూడో వన్డేలో కేశవ్ మహరాజ్తో కేఎల్ రాహుల్ సాంగ్ గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. 'కేశవ్ భాయ్.. నువ్వు బ్యాటింగ్కు వచ్చిన ప్రతిసారి ఇదే సాంగ్ ప్లే అవుతుంది' అని రాహుల్ అన్నాడు.

కాగా, కేశవ్ మహరాజ్ భారత్ సంతతికి చెందినవాడు. అతడి పూర్వీకులు ఉత్తరప్రదేశ్లో నివసించేవారు. 19వ శతాబ్దంలోనే దక్షిణాఫ్రికాకు వలస వెళ్లారు. అయితే భారత్ ప్రపంచంలో భీకర ప్రత్యర్థిగా కేశవ్ అభిప్రాయపడ్డాడు. ''టీమిండియా ఎల్లప్పుడూ భీకర ప్రత్యర్థి. ప్రపంచంలో అత్యుత్తమంగా ఉండాలంటే, అత్యుత్తమ ఆటగాళ్లతోనే మనల్ని మనం పరీక్షించుకోవాలి. భారత్తో పోటీపడటం గొప్ప సవాలుగా ఉంటుంది. అది ఉత్తేజకరమైన సిరీస్" అని కేశవ్ మహారాజ్ పేర్కొన్నాడు.
దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్ను 1-1తో సమం చేసిన టీమిండియా వన్డే సిరీస్ 2-1 తేడాతో నెగ్గింది. ఆసక్తికరంగా సాగిన టెస్టు సిరీస్ను 1-1తో సమం చేసింది. తొలి టెస్టులో ఘోరపరాజయం చవిచూసిన భారత్ రెండో టెస్టులో పుంజుకుని చరిత్రాత్మక విజయం సాధించింది. అయితే ఆఖరి టెస్టు అనంతరం కేశవ్ మహారాజ్కు విరాట్ కోహ్లి తన టెస్టు జెర్సీని అందించాడు. ఈ విషయాన్ని కేశవ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.