ఈ ఏడాది కీలక టోర్నీల్లో భారత జట్టు వైఫల్యాలే చవిచూసింది. అయితే కొందరు ఆటగాళ్లు మాత్రం తమకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకున్నారు. సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్ వంటి వాళ్లు తమకు అవకాశం దొరికిన ప్రతి మ్యాచులోనూ రాణించారు. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్లో తమకు స్థానం దక్కే అవకాశాలను మెరుగు పరుచుకున్నారు. అదే సమయంలో హైదరబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ కూడా ఈ ఏడాది సత్తా చాటాడు.
ఈ ఏడాదిలో రాహుల్ ద్రావిడ్ ప్రయోగాల్లో భాగంగా చాలా సిరీసుల్లో కొత్త బౌలర్లను తీసుకున్నారు. ఈ క్రమంలోనే మహమ్మద్ సిరాజ్కు ఎక్కువ అవకాశాలు దక్కలేదు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో సిరాజ్ను టీం మేనేజ్మెంట్ పక్కన పెట్టేసిందనే చెప్పాలి. టీ20 వరల్డ్ కప్లో బ్యాకప్ బౌలర్గా సిరాజ్ను తీసుకున్నా అతను నెట్స్లో మాత్రమే బౌలింగ్ చేశాడు. అయితే వన్డే ఫార్మాట్లో మాత్రం బుమ్రా, షమీ వంటి వారు లేని సమయంలో సిరాజ్కు అవకాశాలు ఇచ్చారు.
ఇలా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకున్న సిరాజ్.. దాదాపుగా తను ఆడిన ప్రతి మ్యాచ్లోనూ ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది వన్డే ఫార్మాట్లో సిరాజ్ ఇప్పటి వరకు 13 వన్డేలు ఆడాడు. వీటిలో కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. ఇక మిగిలిన 11 మ్యాచుల్లో 21 వికెట్లు తీసుకున్నాడు.
ఒక్క మ్యాచ్లో మాత్రమే 10 పైగా ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. ఆదివారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో కూడా సిరాజ్ రాణించాడు. పది ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 32 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు. ఈ లెక్కన వచ్చే వన్డే వరల్డ్ కప్లో సిరాజ్కు కచ్చితంగా చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.