హైదరాబాద్ సీనియర్స్ ఉమెన్స్ టీమ్ కోచ్ విద్యుత్ జైసింహా మహిళా క్రికెటర్లతో అమర్యాదగా ప్రవర్తించాడు. బస్సులోనే మద్యం తాగుతూ అసభ్యకరంగా ప్రవర్తించిన తీరుపై మహిళ క్రికెటర్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై హైదరాబాద్ బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
కోచ్ జైసింహాతో పాటు ఆయన అసభ్యకర ప్రవర్తనను ప్రోత్సహించిన సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమరావుపై కూడా వేటు వేసినట్లు సమాచారం. అసలేం జరిగిదంటే... మ్యాచ్ ఆడేందుకు మహిళా క్రికెటర్లు విజయవాడకు వెళ్లారు. మ్యాచ్ ముగిసిన అనంతరం హైదరాబాద్కు తిరిగి బస్సులో బయలుదేరారు.

అయితే బస్సులో కోచ్ జైసింహా హద్దులు మీరాడు. మహిళా క్రికెటర్ల ముందే మద్యం సేవిస్తూ వాళ్లతో అసభ్యకరంగా మాట్లాడాడు. జైసింహాతో పాటు ఉన్న పూర్ణిమరావు ఈ ఘటను ఎంకరేజ్ చేయడం గమనార్హం. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని మహిళా క్రికెటర్లు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు ఫిర్యాదు చేశారు.
దీనిపై హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సీరియస్ అయ్యారని తెలుస్తోంది. కోచ్ బాధ్యతల నుంచి జైసింహాను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.