
సహాయక సిబ్బందిపై
జట్టు సహాయక సిబ్బంది ఎంపిక తన ఇష్టమని, ఆ విషయంలో తానే నిర్ణయం తీసుకుంటానని రవిశాస్త్రి అన్నాడు. 'జహీర్, ద్రవిడ్లను సలహాదారులుగా ఎంపిక చేస్తే ఇబ్బందేం లేదు. వారి అనుభవం అమూల్యమైంది. అయితే పూర్తిస్థాయి సిబ్బంది విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోవాల్సింది నేనే. వచ్చే రెండేళ్లు వాళ్లతో కలిసి పనిచేయాల్సింది నేనే' అని అన్నాడు. దీంతో బౌలింగ్ కోచ్ విషయంలో గందరగోళం నెలకొంది.

సీఓఏ కూడా ఈ విషయంలో అసంతృప్తి
మరోవైపు పరిపాలక కమిటీ (సీఓఏ) కూడా ఈ విషయంలో అసంతృప్తిగా ఉంది. నిజానికి జట్టు ప్రధాన కోచ్గా రవిశాస్త్రిని ఎంపిక చేయడంపై సీఓఏ హర్షం వ్యక్తం చేసినా.. బ్యాటింగ్, బౌలింగ్ కోచ్లుగా రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్లను తీసుకోవడంపై కమిటీ అంత సుముఖంగా లేదు. ఈ ఎంపికతో సీఏసీ తమ పరిధిని దాటి వ్యవహరించిందని పరిపాలక కమిటీ భావిస్తోంది. సహాయక సిబ్బందిగా ఎవరుండాలనేది ప్రధాన కోచ్ విచక్షణకే వదిలేయాలని కూడా వారు అభిప్రాయపడుతున్నారు.

వినోద్ రాయ్ వ్యాఖ్యలు ఎంతో బాధించాయి
దీంతో శనివారం ముంబైలో సమావేశం కానున్న సీఓఏ ఈ అంశంపై సమీక్ష చేయనుంది. ఇదిలా ఉంటే ప్రధాన కోచ్ రవిశాస్త్రిని బలవంతపెట్టి ద్రవిడ్, జహీర్ను ఎంపిక చేశారని క్రికెట్ పరిపాలక కమిటీ (సీఓఏ) ఛైర్మన్ వినోద్ రాయ్ చేసిన వ్యాఖ్యలపై క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ వ్యాఖ్యలు తమను ఎంతో బాధించాయంటూ తమ అసంతృప్తిని వ్యక్తం చేసింది.

ముందే రవిశాస్త్రితో మాట్లాడాం
‘జహీర్, ద్రవిడ్లను తీసుకోవడానికి ముందే శాస్త్రితో మాట్లాడాం. మా ఆలోచనను ఆయన అంగీకరించడంతో పాటు ఈ ఎంపిక జట్టుకు లాభిస్తుందని కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రవిశాస్త్రి అనుమతి తర్వాత జరిగిన ఎంపిక మాత్రమే. సమావేశం ముగిసిన వెంటనే పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో ఇదే సమాచారాన్ని రాహుల్ జోహ్రీ, అమితాబ్ చౌదురి సమక్షంలో మీకు (రాయ్)కు ఫోన్ ద్వారా తెలియజేశాం' అని ఆ లేఖలో సీఏసీ స్పష్టం చేసింది.

మనస్ఫూర్తిగా, ఆత్మసాక్షిగా పనిచేశాం
కోచ్ ఎంపిక కోసం తాము సర్వశక్తులు ఒడ్డి మనస్ఫూర్తిగా, ఆత్మసాక్షిగా పని చేశామని తెలిపింది. ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చాలా సావధానంగా, సామరస్యంగా పని పూర్తి చేశామని చెప్పింది. కోచ్ ఎంపిక ప్రక్రియ గురించి తలెత్తిన అనుమానాలను తమరు బహిరంగంగా నివృత్తి చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications