ముంబై ఇండియన్స్ చేతిలో ఘోరంగా ఓడిన ఆర్సీబీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ టీం ఫినిషర్ దినేష్ కార్తీక్ అనారోగ్యం పాలయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి డీకే గొప్ప ఫామ్లో లేడు. అయితే గత రెండు మ్యాచుల్లో కొంచెం టచ్లోకి వచ్చినట్లే కనిపించాడు. ఇక ముంబైతో మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు.
కేవలం 18 బంతుల్లోనే 30 పరుగులు చేసిన డీకే.. ఆర్సీబీ 199 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆర్సీబీ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో అవుటై పెవిలియన్ వెళ్లే సమయంలో డీకే తడబడ్డాడు. కిందకు వంగిపోయి చాలా ఇబ్బంది పడుతూ మైదానం వీడాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో అతను ఆడలేదు.

డీకే లేకపోవడంతో అనూజ్ రావత్ ఈ ఇన్నింగ్స్లో కీపింగ్ చేశాడు. దీంతో డీకే అనారోగ్యంపై ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. దీనిపై ఆర్సీబీ కోచ్ సంజయ్ బంగర్ స్పందించాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు డీకే డీహైడ్రేషన్కు గురయ్యాడని వెల్లడించాడు. ఈ కారణంగానే అతను అనారోగ్యానికి గురైనట్లు తెలిపాడు.
'ఇన్నింగ్స్ ఆడుతుండగానే డీకే కొంత ఇబ్బంది పడ్డాడు. డీహైడ్రేట్ అవడంతో మైదానం వీడే సమయంలో వాంతులు కూడా చేసుకున్నాడు. అయితే వచ్చే మ్యాచ్ సమయానికి తను కోలుకుంటాడనే అనుకుంటున్నాం. ఎందుకంటే మధ్యలో మూడు, నాలుగు రోజుల గ్యాప్ ఉంది కాబట్టి.. మందులు వేసుకుంటే తను తర్వాతి మ్యాచ్కు రెడీగా ఉంటాడు' అని పేర్కొన్నాడు.
ఆర్సీబీలో డీకే పాత్ర చాలా పెద్దదని, జట్టుకు అతను ఎంతో ముఖ్యమని బంగర్ చెప్పాడు. అలాగే తమ జట్టులో కుర్ర ప్లేయర్లు అనుకున్నంతగా రాణించడం లేదని కూడా అన్నాడు. 'మా యంగ్ ఇండియన్ బ్యాటర్లు అనుకున్నంత బాగా ఎదగడం లేదు. లోమ్రోర్ తనకు వచ్చిన అవకాశాలను బాగానే ఉపయోగించుకుంటున్నాడు' అని లోమ్రోర్ను మెచ్చుకున్నాడు.
'అదే సమయంలో అనూజ్ రావత్, షాబాజ్ అహ్మద్ వంటి వాళ్లకు కూడా చాలా అవకాశాలు ఇచ్చాం. కానీ దురదృష్టవశాత్తూ వాటిని ఉపయోగించుకోవడంలో వాళ్లు సక్సెస్ కాలేదు. అయితే కుర్రాళ్ల విషయంలో కొంత ఓపిక పట్టడం చాలా అవసరం. ఈ విషయంలో రింకూ సింగ్ను ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు' అని చెప్పుకొచ్చాడు.