
కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే కాదు, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా ఐపీఎల్ 2022 సీజన్ మర్చిపోలేని చేదుగుర్తులు మిగిల్చింది. ఈ సీజన్లో 11 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ కేవలం 200పరుగులు మాత్రమే చేశాడు. ఇక రోహిత్ సేన మరో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఐపీఎల్లో రోహిత్ శర్మ ప్రస్థానం ప్రారంభం అయినప్పటికీ నుంచి ఈ సీజన్ తప్పితే మిగతా అన్ని సీజన్లలో రోహిత్ బ్యాట్ ఝుళిపించాడు. ఈ ఐపీఎల్ సీజన్లోనే అతను తన అత్యల్ప స్కోరు నమోదు చేశాడు. కేవలం 18సగటుతో, 125 స్ట్రైక్ రేట్తో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేయడం గమనార్హం. ఇప్పటివరకు ఒక్క హాఫ్ సెంచరీ కూడా ఈ సీజన్లో రోహిత్ చేయలేదంటే.. అతను ఎంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడో ఇంకా చెప్పాల్సిన పని లేదు. పేలవ ఫామ్, అన్ లక్కీ సిచువేషన్ల మధ్య సతమతమవుతున్న రోహిత్ శర్మను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సూపర్ ప్రెడిక్షన్ ఇచ్చాడు. రోహిత్ అభిమానులు కాలర్ ఎగరేసే అద్భుత ఇన్నింగ్స్లు హిట్ మ్యాన్ నుంచి త్వరలోనే రాబోతున్నాయంటూ ప్రెడిక్ట్ చేశాడు.
ఇక యువరాజ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ఈ ఐపీఎల్లో రోహిత్కు అదృష్టం లేనప్పటికీ, అతని నుంచి భారీ ఇన్నింగ్స్ రెడీ ఉందంటూ పేర్కొన్నాడు. 'హిట్మ్యాన్ను కొంత దురదృష్టం వెంటాడుతుంది. రోహిత్ నుంచి ఏదో భారీ ఉపద్రవం రాబోతుంది. తప్పకుండా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఇది నా ప్రిడిక్షన్'అని యువరాజ్ ట్వీట్ చేశాడు. రోహిత్ నుంచి భారీగా వచ్చేది ఏంటంటే.. ఓ భారీ ఇన్నింగ్స్ అని ఇన్నర్ మీనింగ్ కాగా.. జాగ్రత్తగా ఉండండి అనడంలో అర్థం.. బౌలర్లు కాస్త చూసుకుని జాగ్రత్త పడాలని యువరాజ్ పేర్కొన్నాడు.
ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో అక్టోబరులో జరగనున్న టీ20 ప్రపంచ కప్ గురించి యువరాజ్ ఈ ప్రిడిక్షన్ చేశాడని తెలుస్తోంది. గతేడాది యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్లో గ్రూప్-స్టేజ్లోనే అవమానకరమైన రీతిలో టీమిండియా నిష్క్రమించిన సంగతి తెలిసిందే. కోహ్లీ నుంచి జట్టు కెప్టెన్సీ పగ్గాలు స్వీకరించిన రోహిత్ శర్మ.. కెప్టెన్సీ వహించిన మ్యాచ్లలో టీమిండియా ఒక్కటంటే ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోలేదు. అక్టోబర్లో ఆస్ట్రేలియాకు వెళ్లే ముందు ఐపీఎల్ తర్వాత భారత్ నాలుగు టీ20 సిరీస్లు ఆడనుంది.