ఆసీస్తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్.. ముందుగా బౌలింగ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఆ నిర్ణయం ఎంత పెద్ద తప్పో ఇన్నింగ్స్ మొదలైన నిమిషాల్లోనే అతనికి అర్థమైంది.
కుర్ర ఓపెనర్ యశస్వి జైస్వాల్ తను ఎదుర్కొన్న ప్రతి బంతికీ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఎడాపెడా బౌండరీలు బాదిన అతను.. కేవలం 25 బంతుల్లోనే 53 పరుగులు చేసి సత్తా చాటాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ (52), సూర్యకుమార్ యాదవ్ (10 బంతుల్లో 19 పరుగులు), రుతురాజ్ గైక్వాడ్ (58) కూడా చూడచక్కని షాట్లతో ఆకట్టుకున్నారు.

ఇక చివర్లో రింకూ సింగ్ (9 బంతుల్లోనే 31 నాటౌట్) గురించి ఎంత తక్కువ చెప్పినా తక్కువే. ఇలా భారత బ్యాటర్లు చెలరేగడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 235 పరుగులు చేసింది. ఛేజింగ్లో ఆసీస్కు అనుకున్న ఆరంభం దక్కలేదు. ఓపెనర్ అవతారం ఎత్తిన స్టీవ్ స్మిత్ (19) పెద్దగా ఆకట్టుకోలేదు. మాథ్యూ షార్ట్ (19) కూడా ఆ జట్టుకు అవసరమైన ఓపెనింగ్ అందించలేకపోయాడు.
భారత్కు తొలి వికెట్ అందించిన రవి బిష్ణోయి.. గత మ్యాచులో సెంచరీ వీరుడు జోష్ ఇంగ్లిస్ (2)ను కూడా బుట్టలో వేసుకున్నాడు. తిలక్ వర్మ అందుకున్న సూపర్ క్యాచ్కు అతను పెవిలియన్ చేరాడు. మ్యాక్స్వెల్ (12) ఫెయిలవగా.. మార్కస్ స్టొయినిస్ (45), టిమ్ డేవిడ్ (37) కాసేపు ఆసీస్ అభిమానులకు ఆశలు కల్పించారు. కానీ డేవిడ్ను అవుట్ చేసిన బిష్ణోయి మరోసారి ఆసీస్ ఆశలపై నీళ్లు చల్లాడు.
చివర్లో ఆసీస్ సారధి మాథ్యూ వేడ్ (42 నాటౌట్) కొంత పోరాడినా అప్పటికి కంగారూల ఓటమి ఖాయమైంది. దీంతో ఆసీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచులో 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన భారత్.. ఐదు టీ20ల సిరీసులో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయి, ప్రసిద్ధ్ కృష్ణ చెరో మూడు వికెట్లతో రాణించారు. మిగతా బౌలర్లు తలా ఒక వికెట్ తీసుకున్నారు.