11 టీ20 మ్యాచ్లే:
ప్రపంచకప్కు ముందు టీమిండియాకు కేవలం 11 టీ20 మ్యాచ్లు ఉన్నాయి. వీటిల్లోనే పటిష్ట జట్టును తయారుచేసుకోవాలి. విరాట్ కోహ్లీ సారథ్యంలో ఇప్పటివరకు టీమిండియా 45 మ్యాచ్లు ఆడింది. ఇందులో 30 విజయాలు ఉండగా.. 14 ఓటములు ఉన్నాయి. 14 ఓటములలో మొదట బ్యాటింగ్ చేసినపుడు 10 ఎదురయ్యాయి. అంటే టార్గెట్ ఛేదించడంలో టీమిండియాకు ఎదురులేదు.
ధావన్ vs రాహుల్:
టీమిండియా ఇదే జోరును ప్రపంచకప్లో కూడా కొనసాగించాలంటే పటిష్ట జట్టు అవసరం. అయితే జట్టులో కొందరి స్థానాలు పదిలం కాగా.. మరికొందరివి అయోమయంలో ఉన్నాయి. రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధావన్ వన్డేలలో మంచి ఆటగాడు. అయితే టీ20 ఫార్మాట్లో మాత్రం వేగంగా పరుగులు చేయలేకపోతున్నాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మకు సరైన తోడుగా నిలవలేకపోతున్నాడు. దీంతో కేఎల్ రాహుల్.. శర్మకు సరైన జోడిగా భావిస్తున్నారు. ఇప్పుడు రాహుల్ నిరూపించుకుంటే ఓపెనర్ పోసిషన్ సొంతం అవుతుంది.
అసలు సమస్య పంత్:
మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ వస్తారు. ఆ తర్వాత మనీష్ పాండే ఉన్నాడు. ఇక అసలు సమస్య యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్. బ్యాటింగ్, కీపింగ్ రెండు విభాగాల్లో విఫలమవుతుండడం మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్పై సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే సంజు సాంసన్ను తీసుకున్నారు. మెగా టోర్నీలోగా అతనికి అవకాశాలు ఇచ్చి గాడిలో పెడితే ఇక తిరుగుండదు.
ఆల్రౌండర్లకు కొదవ లేదు:
ఇక ఆల్రౌండర్లకు జట్టులో కొదవ లేదు. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే లాంటి ఆటగాళ్లు ఉన్నారు. ఇందులో సరైన వారిని ఎంచుకుంటే చాలు. మరోవైపు పేస్, స్పిన్ విభాగాల్లో టీమిండియాకు నాణ్యమైన పేసర్లు ఉన్నారు. బుమ్రా, భువనేశ్వర్, షమీ లాంటి సీనియర్లు.. చాహర్, ఖలీల్, సైనీ, ఠాకూర్ పేస్ బాధ్యతలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బుమ్రాకు తోడుగా చాహర్ చెలరేగుతాడు. వీరికి భువనేశ్వర్, షమీ కూడా అండగా ఉండనున్నారు.
ఇదే ప్రణాళిక:
స్పిన్ విభాగంలో చాలా పోటీ ఉంది. చహల్, కుల్దీప్, జడేజా, సుందర్, కృనాల్ రేసులో ఉన్నారు. మరి కోహ్లీ ఎవరికి ఓటేస్తాడో చూడాలి. ప్రస్తుతం ధావన్, పంత్ స్థానాలను సరైన వారితో భర్తీ చేస్తే.. టీమిండియాకు ఎదురుండదు. వీరిని కనుక్కోవడమే ఇప్పుడు టీమిండియాకు అసలు సవాల్. ఇదే ప్రణాళికతో కోహ్లీ ముందుకెళ్లనున్నాడు. 11 టీ20 మ్యాచ్లలో అన్ని సెట్ చేసుకోవడమే లక్ష్యంగా టీమిండియా సిద్ధమవుతుంది.