
హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ పదో తరగతి బోర్డు ఎగ్జామ్స్కు హాజరవుతున్న విద్యార్ధులకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 'పరీక్ష'గా నిలిచాడు. విరాట్ కోహ్లీ విద్యార్థులకు పరీక్షగా నిలవడమేంటని అనుకుంటున్నారా? అవును... మీరు విన్నది నిజమే. విద్యార్థులకు కోహ్లీ గురించిన ఓ ప్రశ్న పరీక్షలో వచ్చింది.
పశ్చిమ బెంగాల్లో పదో తరగతి బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులకు ఇంగ్లీష్ పేపర్లో విరాట్ కోహ్లీ గురించి ఓ ప్రశ్న అడిగారు. అందులో కోహ్లీ గురించి కొంత సమాచారమిచ్చి అతడి గురించి వివరిస్తూ రాయమని ఉంది. తప్పక సమాధానం రాయల్సిన పది మార్కుల ప్రశ్న అది.
దీంతో ఆ ప్రశ్నను చూసిన విద్యార్ధులు తొలుత ఆశ్యర్యపడ్డ విద్యార్థులు ఆ తర్వాత కోహ్లీ గురించి తమకు తెలిసిందని మొత్తం రాసుకొచ్చారంట. ఈ విషయాన్ని ముర్షిదాబాద్లోని నబీపూర్ సరళబాల హైస్కూల్కు చెందిన విద్యార్ధి షమీమ్ అక్తర్ వెల్లడించాడు.
"ఎగ్జామ్లో ఇటువంటి ప్రశ్న ఒకటి వస్తుందని నేను ఊహించలేదు. విరాట్ కోహ్లీ నా ఐడల్ కావడంతో అతడి గురించి మొత్తం రాసేశా" అని పేర్కొన్నాడు. పశ్చిమ మిదానపూర్ జిల్లాలోని మిదాన్పూర్ మిషన్ గర్ల్స్ హైస్కూల్ విద్యార్ధి శ్రేయా ఘోషల్ మాట్లాడుతూ "ఇది తప్పనిసరిగా రాయాల్సిన 10 మార్కుల ప్రశ్న. క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన పాయింట్ల సమాచారంతో అతడికి సంబంధించిన పూర్తిగా రాశా" అని చెప్పింది.
నిజానికి భారత్లో క్రికెట్ను ఓ మతంలా భావిస్తుంటారు. అలాంటిది టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి అడిగితే ఆ ప్రశ్నను వదిలిపెడతారా? పరీక్షలో ఈ ప్రశ్న ఇవ్వడంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. తమకు కోహ్లీ గురించి కొంత సమాచారం ఇచ్చారని, అది ఇవ్వకపోయినా మేము సమాధానం రాసేవారమని కొంత మంది విద్యార్థులు కోహ్లిపై అభిమానాన్ని చాటుకున్నారు.
ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో విరాట్ కోహ్లీ గురించిన ప్రశ్న రావడంపై బంగాల్ మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా సంతోషం వ్యక్తం చేశాడు. లక్ష్మీ రతన్ శుక్లా ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతేడాది పదో తరగతి పరీక్షలకు 1.07మిలియన్ విద్యార్ధులు హాజరవ్వగా, ఈ ఏడాది ఆ సంఖ్య 1.1 మిలియన్కు చేరింది.