హైదరాబాద్: సామాజిక అంశాలపై స్పందించేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎప్పుడూ ముందుంటాడు. చాలా సందర్భాల్లో మహిళలపై తనకు ఎంత గౌరవం ఉందో కోహ్లీ తెలియజేశాడు. తాజాగా ఓ వాచ్ కంపెనీ ప్రచార కర్తగా రూపొందించిన ఓ వీడియోను కోహ్లీ ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు.
మహిళల పట్ల మర్యాదగా ఉండాలని, ఇది మీ సమయమని జెంటిల్ మెన్లా ఉండాలంటూ ఓ వీడియోని తన ట్విట్టర్లో కోహ్లీ పోస్టు చేశాడు. 'ఇది మీసమయం.. ఈ జీవితాన్ని వారే ఇచ్చారని చెప్పడానికి గర్వపడుతున్నాను. కొందరు మహిళల పట్ల ప్రవర్తిస్తున్న తీరుకు సిగ్గుపడుతున్నా. జెంటిల్ మెన్లా ఉండడానికి ఇదే మీకు సరైన సమయం' అని కోహ్లీ అందులో పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంకపై టీమిండియా 304 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయం తర్వాత 'పూల్లో ఉల్లాసంగా' అని కామెంట్ చేస్తూ కేఎల్ రాహుల్తో కలసి ఉన్న ఫొటోను కోహ్లీ ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఆగస్టు 3 నుంచి రెండో టెస్టు కొలంబో వేదకిగా జరగనుంది.