వరల్డ్ కప్లోనూ మంచు ఎఫెక్ట్..
ఈ ఏడాది చివర్లో వన్డే వరల్డ్ కప్ కూడా భారత్లోనే జరుగుతోంది. అది కూడా చలికాలంలో ఈ టోర్నీ జరుగుతుంది. దీంతో దీనిపై కూడా మంచు ప్రభావం కచ్చితంగా పడనుంది. అయితే వరల్డ్ కప్ వంటి టోర్నీలో మంచు ప్రభావం వల్ల మ్యాచ్ ఫలితాలు ప్రభావితం అవడం కరెక్ట్ కాదని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. అంతకుముందు యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్లో కూడా టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ తీసుకొని మ్యాచులు గెలవడం సర్వసాధారణంగా మారిన సంగతి తెలిసిందే.
మంచు సమస్యకు ఇలా చెక్..
ఈ మంచు సమస్యకు చెక్ పెట్టేందుకు అశ్విన్ ఒక మంచి సలహా ఇచ్చాడు. సాధారణంగా భారత్లో డే నైట్ మ్యాచులు మధ్యాహ్నం 1.30కు మొదలవుతాయి. అక్కడి నుంచి టీవీల్లో పీక్ వ్యూయర్షిప్స్ వచ్చే సమయం వరకు మ్యాచ్ సాగుతుంది. దీనికోసమే మ్యాచులను ఈ సమయంలో షెడ్యూల్ చేస్తారు. అయితే ఇలా చేయడం కన్నా మ్యాచులను కనీసం ఒక రెండు గంటల ముందుగా మొదలు పెడితే మంచిదని అశ్విన్ అన్నాడు. దీని వల్ల మ్యాచ్ ఫలితాలపై మంచు ప్రభావం ఉండదన్నాడు.
వరల్డ్ కప్ను బతికించండి..
వ్యూయర్షిప్ సమస్య గురించి కూడా అశ్విన్ మాట్లాడాడు. సాధారణ మ్యాచులు అయితే ప్రేక్షకులు చూడరని, అందుకే పీక్ అవర్స్లో మ్యాచ్ జరిగేలా షెడ్యూల్ చేయాలనే వాదనను కూడా అశ్విన్ సమర్ధించాడు. అయితే వన్డే వరల్డ్ కప్ మ్యాచులకు ఇలాంటి పరిస్థితి ఉంటుందంటే తను నమ్మలేనని స్పష్టం చేశాడు. వరల్డ్ కప్ మ్యాచులు కాబట్టి ప్రజలు కచ్చితంగా చూస్తారని అభిప్రాయపడ్డాడు. అలాగే అసలు వరల్డ్ కప్లను చలికాలం పెట్టడం ఏంటని ప్రశ్నించాడు. దీనివల్ల మంచు ప్రభావం ఉంటుందని తెలిసి కూడా ఇలా చేయడం వెనుక లాజిక్ ఏంటో తనకు అర్థం కాలేదన్నాడు. కనీసం వరల్డ్ కప్లను అయినా బతికించాలని సూచించాడు.