
హైదరాబాద్: భారత క్రికెట్లో అసమానత్వం రాజ్యమేలుతోందని, జనాభా ప్రాతిపదికన దక్కాల్సిన ప్రాధాన్యం ఎస్సీ, ఎస్టీ ఆటగాళ్లకు దక్కడం లేదంటూ ఓ ఆంగ్ల వెబ్సైట్ ప్రచురించిన కథనంపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.
వివరాల్లోకి వెళితే... క్రికెట్లో రిజర్వేషన్లు ఉండాలంటూ 'ది వైర్' ఆంగ్ల వెబ్సైట్ ఓ ఆర్టికల్ను ప్రచురించింది. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టులో నల్లజాతీయులకు ప్రత్యేకంగా రిజర్వేషన్ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ టీమిండియాలోనూ అలాగే ఉండాలని ఆ కథనంలో పేర్కొంది.
'ది వైర్' వెబ్సైట్ తన కథనంలో ''భారత్కు టెస్ట్ హోదా వచ్చి 86 ఏళ్లు దాటింది. ఇన్నేళ్లలో 290 మంది దేశం కోసం ఆడారు. వీరిలో నలుగురు మాత్రమే ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వారు ఉన్నారు. జనాభా ప్రకారం చూస్తే నిజానికి 70 మంది ఆడాలి. కానీ నలుగురికి మాత్రమే ఆ అవకాశం లభించింది. ఇది వివక్షే. ఈ అసమానత్వాన్ని తేలిగ్గా తీసుకోలేం'' అని పేర్కొంది.
ఈ కథనంపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఈ ఆర్టికల్పై ట్విటర్లో స్పందిస్తూ "మీడియాలో ఎంత మంది ప్రముఖ జర్నలిస్టులు లేదా ఎడిటర్లు ఎస్సీ, ఎస్టీకి చెందినవాళ్లు ఉన్నారు. దేశంలో కుల వ్యవస్థను విజయవంతంగా అధిగమించిన ఘనత ఒక్క క్రీడలకే దక్కుతుంది. ప్లేయర్స్ అంతా ఒక్కటిగా ఆడతారు. కానీ ఇలాంటి జర్నలిజం ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నది" అని కైఫ్ ట్వీట్ చేశాడు.
కైఫ్ ట్వీట్కు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. క్రికెట్ నుంచి రిటైరైనా సిక్సర్లు కొట్టడం ఆపడం లేదంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గతంలో కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే కూడా క్రికెట్లో రిజర్వేషన్లు ఉండాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
"వివిధ టోర్నీలకు ఎంపికయ్యే ఆటగాళ్లలో అగ్రవర్ణాల వాళ్లే ఉన్నారు. ఇది ఆగాల్సిందే. వెనుకబడిన వర్గాలవాళ్లలోనూ సామర్థ్యం ఉన్న ప్లేయర్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్లకు సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది జూనియర్ లెవల్కే పరిమితమవుతున్నారు తప్ప.. టెస్టు లేదా వన్డే స్థాయికి చేరలేకపోతున్నారు" అని అథవాలే అన్న సంగతి తెలిసిందే.