

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇచ్చిన సహకారం, ప్రోత్సాహంతోనే తన ఆటతీరు మెరుగైందని కేదార్ జాదవ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్లో కేదార్ జాదవ్ అటు బంతితోనూ, ఇటు బ్యాట్తోనూ రాణిస్తోన్న సంగతి తెలిసిందే.
దుబాయి వేదికగా బుధవారం పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో కేదార్ జాదవ్ (3/23) మ్యాజిక్కు మిడిలార్డర్ చెల్లచెదురైన సంగతి తెలిసిందే. అయితే, తన విజయం వెనుక మాజీ కెప్టెన్ ధోని పాత్ర కీలకమని అన్నాడు. స్వదేశంలో 2016లో న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో ధోని తన చేతికి బంతిని ఇవ్వడం కెరీర్నే మార్చివేసిందని చెప్పాడు.
తాజాగా కేదార్ జాదవ్ మాట్లాడుతూ "గతంలో నా ఫోకస్ అంతా బ్యాటింగ్పైనే ఉండేది. నాపై నాకు అంత నమ్మకం ఉండేది కాదు. రెండేళ్ల కిందట కివీస్తో జరిగిన సిరీస్తో నా దశ తిరిగింది. బౌలింగ్ చేయాలంటూ ధోనీ బంతిని అందించడం నా జీవితాన్నే మార్చేసింది. నాపై నాకు మరింత నమ్మకం పెరిగింది" అని అన్నాడు.
"ఆత్మ విశ్వాసంతో ఆడుతున్నా. వికెట్ టు వికెట్ బంతులు సంధించి ఫలితాలు సాధిస్తున్నాను. ధోని ఇచ్చిన సహకారం, ప్రోత్సాహంతోనే నా ఆటతీరు మెరుగైంది. పూర్తి స్వేచ్ఛగా క్రికెట్ను ఆస్వాదిస్తున్నాను. కేవలం రెండు ఓవర్లకు మించి ఎక్కువ ఓవర్లు నెట్స్లో ప్రాక్టీస్ చేయను" అని జాదవ్ చెప్పాడు.
"కానీ మ్యాచ్లో పూర్తిస్థాయి ప్రదర్శణ చేయడమే నా లక్ష్యం. గత ఆరు నెలల్లో మూడుసార్లు గాయాలపాలయ్యా. అయితే తాజాగా చేసిన సర్జరీ తర్వాత నా ఫిట్నెస్ మెరుగైంది. ధోని లాంటి సీనియర్లతో ఆటతో పాటు ఆరోగ్య సూత్రాలు నేర్చుకోవడం తనకు అలవాటు" అని కేదార్ జాదవ్ పేర్కొన్నాడు.