ఇంగ్లాండ్ తో రీషెడ్యూల్ చేసిన అయిదో టెస్ట్ కు జట్టు కెప్టెన్ ఎవరా అనే విషయంలో ఉత్కంఠ వీడింది. జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్ గా బీసీసీఐ ప్రకటించింది. 1987లో కపిల్ దేవ్ తర్వాత టెస్టుల్లో భారత్ కు నాయకత్వం వహిస్తున్న భారత ఫాస్ట్ బౌలర్ గా బుమ్రా రికార్డు నెలకొల్పాడు. ఇక భారత టెస్ట్ జట్టు 36వ కెప్టెన్ గా కూడా బుమ్రా నిలిచాడు. ఇక బుమ్రా భార్య సంజనా గణేశన్ .. బుమ్రా కెప్టెన్ గా అవ్వడంతో అతని కుటుంబం ఎలా స్పందించిందో తెలియజేసింది. వార్మప్ మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మకు కోవిడ్ -19 సోకడంతో రోహిత్ అయిదో టెస్ట్ మ్యాచ్ కు దూరమయ్యాడు. గురువారం నిర్వహించిన ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో సైతం అతనికి పాజిటివే రావడంతో ఇక అతన్ని చివరి టెస్ట్ నుంచి తప్పించక తప్పలేదు. ఇక బుమ్రా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న జట్టుకు నాయకత్వం వహించే అవకాశం దక్కడంపై బుమ్రా తల్లి చాలా ఆనందం వ్యక్తం చేశారని సంజనా గణేషన్ తెలిపింది. అలాగే టెస్ట్ కెప్టెన్ కి కొన్ని చిట్కాలు, ఉపాయాలను కూడా సూచించిందటా. అత్తయ్య చాలా ఉత్సాహపడ్డారు. బుమ్రా క్రికెట్లో రాణించడాన్ని ఆమె ఎప్పుడూ ఇష్టపడుతుంది. బుమ్రా ఈ స్థాయికి చేరడానికి ఎంత కష్టపడ్డాడో అతని క్రికెట్ ప్రయాణాన్ని మొత్తం ఆమె చూసింది. ఇక భారత్ టెస్ట్ కెప్టెన్ గా బుమ్రాను ప్రకటించిన విషయం తెలియగానే ఆమె ఉప్పొంగిపోయింది. ఆమె ఎప్పుడూ క్రికెట్ ఆడనప్పటికీ.. ఆమె వద్ద ఎన్నో చిట్కాలు, ట్రిక్స్ ఉన్నాయి. ఒక తల్లిగా నిరంతరం అతన్ని ఎప్పుడూ మోటివేట్ చేస్తూనే ఉంటుంది. అని సంజనా గణేశన్ ఐసీసీ ప్రతినిధులతో పేర్కొన్నారు. తన భర్త టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడాన్ని బుమ్రా భార్య సంజనా గణేషన్ కూడా చాలా హ్యాపీగా ఫీలయింది. ఈ విషయాన్ని అతను గ్రహించడానికి తొలుత కాస్త టెన్షన్ పడి ఉంటాడనుకుంటున్నా. కానీ అతనికి ఈ విషయాన్ని ఆవాహన చేసుకోవడానికి తగినంత టైం దొరికింది. అతని పట్ల చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. అని గణేశన్ జోడించారు.