గత ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన చేసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఆ దెబ్బతో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ దిద్దుబాటు చర్చలు వేగవంతం చేసింది. ఐపీఎల్ మినీ వేలంలో ఆటగాళ్లపై రూ.కోట్లు కుమ్మరించింది. కెప్టెన్ను మార్చింది. జెర్సీని కూడా ఛేంజ్ చేసింది. ఈ సారి టైటిల్ సాధించాలని కసిగా ఐపీఎల్ 17వ సీజన్లో బరిలోకి దిగుతుంది.
అయితే సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా ప్యాట్ కమిన్స్ను నియమించడంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కమిన్స్ రాణించిన వన్డే వరల్డ్ కప్, టెస్టు ఛాంపియన్ షిప్ రెండూ భిన్నమైన ఫార్మాట్లని, టీ20 ఫార్మాట్ ప్రత్యేకమైనదని తెలిపాడు. కాగా, ఈ సీజన్లో కమిన్స్ రాణించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

గతేడాది వన్డే వరల్డ్ కప్, టెస్టు ఛాంపియన్షిప్లను కమిన్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అందుకే ఈ ఆస్ట్రేలియా కెప్టెన్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్లు ఖర్చు పెట్టింది. బౌలింగ్తో పాటు బ్యాటింగ్ చేసే సత్తా ఉండటంతో కెప్టెన్గా నియమించింది. గత సీజన్లో ఎస్ఆర్హెచ్ను నడిపించిన ఎయిడెన్ మార్క్రమ్కు బదులుగా కమిన్స్కు సారథి బాధ్యతలు అందించింది.
''అంతర్జాతీయ క్రికెట్లో వన్డే వరల్డ్ కప్, టెస్టు ఛాంపియన్షిప్ సాధించి జోరు మీదున్న కమిన్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ అంచనాలు పెట్టుకుంది. అయితే ఐపీఎల్లో కమిన్స్ గణాంకాలు అంత గొప్పగా లేవు. దాదాపు ఎనిమిదన్నర ఎకానమీ రేటును కలిగి ఉన్నాడు. నాణ్యమైన ఫాస్ట్ బౌలర్ అయిన కమిన్స్కు అంత ఎక్కువ ఎకానమీ రేటు ఉండకూడదు. ఈ సీజన్లో దాన్ని తగ్గిస్తాడనుకుంటున్నా''
''తమకు దూరమైన విజయాలని కమిన్స్ తిరిగి అందిస్తాడని సన్రైజర్స్ హైదరాబాద్ ఆశలు పెట్టుకుంది. అయితే నా అభిప్రాయం ప్రకారం వన్డే, టెస్టు క్రికెట్తో పోలిస్తే టీ20 క్రికెట్ భిన్నమైనదిగా భావిస్తున్నాను'' అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. ఐపీఎల్లో 42 మ్యాచ్లు ఆడిన కమిన్స్ 45 వికెట్లు పడగొట్టాడు. 8.54 ఎకానమీ రేటుతో బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్ విషయానికొస్తే 18 సగటుతో 379 పరుగులు చేశాడు. కాగా, మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది.