బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. కాన్పూర్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో వర్షం కారణంగా దాదాపు రెండున్నర రోజుల ఆట కోల్పోయినప్పటికీ టీమిండియా గొప్పగా పోరాడి మ్యాచ్ను గెలుచుకుంది. 173.2 ఓవర్లలో ముగిసిన రెండో టెస్టులో ఏడు వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తుగా ఓడించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో చిన్న మ్యాచ్.
వరుణుడు ప్రతాపంతో తొలి రోజు 35 ఓవర్లు మాత్రమే ఆట జరిగిన విషయం తెలిసిందే. రెండో రోజు, మూడో రోజు పూర్తిగా రద్దయింది. కానీ చివరి రెండు రోజులు భారత్ అద్భుతంగా పోరాడి మ్యాచ్ను గెలుచుకుంది. టెస్టు సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు. 114 పరుగులతో పాటు 11 వికెట్లు పడగొట్టాడు.

అయితే ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్న ప్లేయర్గా ముత్తయ్య మురళీధరన్తో సమంగా నిలిచాడు. అశ్విన్, మురళీధరన్ ఇద్దరూ 11 సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నారు. అయితే వాస్తవానికి అశ్విన్.. మురళీధరన్ రికార్డును అధిగమించి ఇప్పటికే చరిత్ర సృష్టించాలి. కానీ వెస్టిండీస్ కారణంగా వరల్డ్ రికార్డును ఇంకా అందుకోలేదు.
2023లో వెస్టిండీస్ పర్యటనకు భారత్ వెళ్లింది. రెండు టెస్టుల సిరీస్ను 1-0తో కైవసం చేసుకుంది. అయితే ఈ సిరీస్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించలేదు. దీన్ని ప్రకటిస్తే తప్పక అశ్విన్కే దక్కుతుంది. ఈ సిరీస్లో అశ్విన్ ఏకంగా 15 వికెట్లు తీశాడు. అశ్విన్ తర్వాతి స్థానంలో అత్యధిక వికెట్లు సాధించిన జడేజా తీసిన వికెట్లు 7 మాత్రమే. అంతేగాక అశ్విన్ హాఫ్ సెంచరీ కూడా చేశాడు. దీంతో అశ్విన్కే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కడం ఖాయం.
కానీ రెండో టెస్టు మ్యాచ్ అనంతరం సిరాజ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు చేతులు దులుపుకుంది. ప్రెజంటేషన్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు మరిచిపోయారేమో అని భావించారంతా. కానీ తర్వాత కూడా దాని గురించి వెస్టిండీస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. సాధారణంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్లు జరిగిన సిరీస్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఇస్తారు. కానీ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాత్రం ఇవ్వలేదు.