లాహోర్: పాకిస్థాన్లో క్రికెట్ ఆడటం ఎంతమాత్రం సురక్షితం కాదని ఆ దేశ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రెండు రోజుల క్రితం క్వెట్టాలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్పై టెర్రరిస్టులు నరమేధం సృష్టించి 62 మంది పోలీసులను బలిగొన్న సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ ఉగ్రదాడిలో సుమారు 170మందికి పైగా గాయాలు పాలయ్యారు. ఈ ఘటన అనంతరం అక్తర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే పాకిస్థాన్లో క్రికెట్ ఆడేందుకు విదేశీ జట్లు వెనకడుగు వేస్తున్నాయి. తాజాగా అక్తర్ చేసిన ఈ వ్యాఖ్యల ద్వారా పాకిస్థాన్ క్రికెట్ ఆడేందుకు ఎంతమాత్రం సురక్షితమైన దేశం కాదని తేల్చి చెప్పాడు.
అంతేకాదు పాకిస్థాన్కు క్రికెట్ ఆడేందుకు విదేశీ జట్లు రావొద్దని హెచ్చికలు జారీ చేశాడు. తమ దేశంలో సరైన రక్షణ లేదన్న విషయాన్ని అంగీకరించాడు. 'మా దేశంలో సరైన భద్రత లేదు. ఇది విదేశీ జట్లకు ఎంత మాత్రం సురక్షితం కాదు. పాకిస్తాన్లో పరిస్థితులు చక్కబడేవరకూ ఏ జట్టు ఇక్కడకు రావడం అంత శ్రేయస్కరం కాదు' అక్తర్ వ్యాఖ్యానించాడు.

'దేశంలోని రక్షణపై నెలకొన్న ఆందోళనకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అందుకు ఓపిక పట్టక తప్పుదు. మా దేశంలో విదేశీ క్రికెట్ జట్లు పర్యటించడానికి కొంత సమయం అయితే అవసరం' అని అక్తర్ పేర్కొన్నాడు. త్వరలోనే పాక్లో సాధారణ పరిస్థితి నెలకొంటుదనే ఆశాభావం వ్యక్తం చేశాడు.
నవ్వు ఆపుకోలేరు: షోయబ్ చేసిన చిన్న తప్పు, ట్విట్టర్లో జోకులు
2009లో శ్రీలంక జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిస్థాన్ తన టోర్నమెంట్లను యూఏఈలో నిర్వహిస్తుంది. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ మధ్య కాలంలో అప్ఘనిస్ధాన్, కెన్యా, జింబాబ్వే లాంటి దేశాలను క్రికెట్ ఆడేందుకు ఆహ్వానించింది.
ఈ క్రమంలో అక్తర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. విదేశీ జట్లు తమ దేశంలో పర్యటించాలని పీసీబీ ప్రయత్నాలు చేయడం నిజంగా దురదృష్టకరమని అన్నాడు. తమ దేశంలో ఉగ్రదాడులు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇక్కడకు రావాలంటూ విదేశీ జట్లను ఆహ్వానించడం ప్రస్తుతం సరైన చర్య కాదన్నాడు.