హైదరాబాద్: ఆసియా కప్లో పాల్గొనబోయే ఆరో జట్టు ఏదో తెలిసిపోయింది. సెప్టెంబర్ 15 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ టోర్నీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో పాల్గొనే ఆరో జట్టుగా హాంకాంగ్ అర్హత సాధించింది. టోర్నీలో భాగంగా గ్రూప్ 'ఎ'లో భారత్, పాకిస్తాన్లతో హాంకాంగ్ తలపడనుంది.
గురువారంతో ముగిసిన ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీ ఫైనల్లో హాంకాంగ్ రెండు వికెట్ల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై ఘన విజయం సాధించింది. 24 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన యూఏఈ 9 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
యూఏఈ జట్టులో ఓపెనర్ అష్ఫాఖ్ అహ్మద్ (51 బంతుల్లో 79) టాప్ స్కోరర్గా నిలిచాడు. హాంకాంగ్ బౌలర్లలో ఎజాజ్ ఖాన్కు 5, నదీమ్ అహ్మద్కు 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 177 పరుగల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్కు డక్వర్త్ లూయీస్ ప్రకారం 179 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
హాంకాంగ్ 23.3 ఓవర్లలో 8 వికెట్లకు 179 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. నిజాకత్ ఖాన్ (20 బంతుల్లో 38), కార్టర్ (32 బంతుల్లో 33) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ ఏడాది మొదట్లో వన్డే స్టేటస్ను కోల్పోయిన హాంకాంగ్ మళ్లీ ఆసియా కప్లో ఆడుతుండటం విశేషం.
హాంకాంగ్ గతంలో 2004, 2008 ఆసియా కప్లలో పాల్గొంది. మరోవైపు గ్రూప్ 'బి'లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్లు ఉన్నాయి. సెప్టెంబర్ 15 నుంచి జరగనున్న ఆసియా కప్ టోర్నీని ఈసారి 50 ఓవర్ల ఫార్మాట్లో నిర్వహిస్తోండటం విశేషం.