INDW vs ENGW: భారత మహిళల జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. తొలుత టీ20 సిరీస్ ఆడిన తర్వాత రెండు జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరిగింది. టీ20 సిరీస్ తర్వాత, వన్డే సిరీస్లోనూ భారత మహిళల జట్టు ఇంగ్లండ్ను చిత్తు చేసింది. మూడో వన్డే చెస్టర్-లే-స్ట్రీట్లో జరిగింది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లండ్ను మూడో, చివరి వన్డేలో 13 పరుగుల తేడాతో ఓడించింది. దీనితో భారత్ 2-1తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అద్భుతమైన బ్యాటింగ్తో సెంచరీ సాధించారు. ఈ శతకంతో హర్మన్ప్రీత్ ఇంగ్లండ్ గడ్డపై చరిత్ర సృష్టించారు. హర్మన్ప్రీత్ కౌర్(102) సెంచరీతో అదరగొట్టగా..క్రాంతి గౌడ్(6/52) సూపర్ బౌలింగ్ తోడవడంతో మూడో మ్యాచ్లో భారత్ విజయం సాధించింది.
భారత కెప్టెన్ హర్మన్ప్రీత్తో పాటు జెమీమా రోడ్రిగ్స్(45 బంతుల్లో 50 పరుగులు), స్మృతి మంధాన(45), హర్లీన్ డియోన్(45) రాణించడంతో భారత్ 5 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌట్ అయింది. క్రాంతి గౌడ్ తన అద్భుతమైన బౌలింగ్తో ఆ జట్టును కట్టడి చేసింది. ఇంగ్లాండ్ జట్టును తీవ్రంగా దెబ్బతీసింది. క్రాంతి గౌడ్ 6 వికెట్లు పడగొట్టగా.. శ్రీచరణి 2 వికెట్లు తీసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో నాట్ సీవర్(98) గొప్పగా ఆడినా.. ఇంగ్లాండ్ జట్టును గెలిపించలేకపోయింది. ఎమ్మా లాంబ్(68), అలిస్(44) రాణించారు.

ఇంగ్లండ్ గడ్డపై అద్భుతాలు సాధించిన హర్మన్ప్రీత్ కౌర్
ఈ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ 84 బంతుల్లో 102 పరుగులు చేశారు. ఇందులో 14 ఫోర్లు ఉన్నాయి. వన్డేల్లో హర్మన్ప్రీత్కు ఇది ఏడో సెంచరీ. మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ కేవలం 82 బంతుల్లోనే సెంచరీ సాధించారు. దీనితో ఆమె మహిళల వన్డే క్రికెట్లో అతి వేగవంతమైన సెంచరీ సాధించిన రెండో భారత క్రీడాకారిణిగా నిలిచారు.భారత మహిళల జట్టు తరఫున వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు స్మృతి మంధాన పేరు మీద ఉంది. ఆమె ఈ ఏడాది ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించారు. మంధానా ఐర్లాండ్పై కేవలం 70 బంతుల్లోనే సెంచరీ చేశారు.
అంతేకాకుండా హర్మన్ప్రీత్ కౌర్ ఇంగ్లండ్ గడ్డపై వన్డేల్లో 3 సెంచరీలు సాధించిన తొలి సందర్శక మహిళా క్రికెటర్ అయ్యారు. ఇంతకుముందు దిగ్గజ క్రీడాకారిణులు మిథాలీ రాజ్, మెగ్ లానింగ్ ఇంగ్లండ్ గడ్డపై 2-2 సెంచరీలు సాధించారు. అలాగేవన్డే క్రికెట్లో హర్మన్ప్రీత్ 4 వేల పరుగులు కూడా పూర్తి చేసుకున్నారు. హర్మన్ప్రీత్ కౌర్ ఇప్పుడు వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత క్రీడాకారిణిగా నిలిచారు. ఆమె పేరున 4069 పరుగులు నమోదయ్యాయి. భారత్ తరఫున మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు మిథాలీ రాజ్ పేరు మీద ఉంది, ఆమె 7805 పరుగులు చేశారు. 4588 పరుగులతో స్మృతి మంధాన రెండో స్థానంలో ఉన్నారు.