మహిళల టీ20 ప్రపంచకప్-2024లో దక్షిణాఫ్రికా సంచలన విజయం సాధించింది. సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి వరుసగా రెండో సారి ఫైనల్కు దూసుకెళ్లింది. దుబాయ్ వేదికగా గురువారం జరిగిన సెమీస్లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో చారిత్రక విజయాన్ని అందుకుంది. టీ20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికాకు ఇదే తొలి విజయం.
మరోవైపు మహిళల టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా ఫైనల్ చేరకపోవడం ఇదే ప్రథమం. ఇప్పటివరకు ఏడు సార్లు టీ20 ప్రపంచకప్ నిర్వహించగా ఆస్ట్రేలియా ఆరు సార్లు విజేతగా నిలిచింది. ఒకసారి ఫైనల్లో ఓటమిపాలైంది. కాగా, మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 134 పరుగులు చేసింది. బెత్ మూనీ (44; 42 బంతుల్లో, 2 ఫోర్లు ) టాప్స్కోరర్.

ఎలిస్ పెర్రీ (31; 23 బంతుల్లో, 2 ఫోర్లు), తాలియా (27; 33 బంతుల్లో, 3 ఫోర్లు ) ఫర్వాలేదనిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో అయబోంగా ఖకా రెండు వికెట్లు తీసింది. ఆసీస్ 18 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన తాలియాతో కలిసి బెత్ మూనీ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించింది. కానీ సఫారీ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి స్కోరును కట్టడి చేశారు.
అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా 17.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. అనెకె బాష్ (74 నాటౌట్; 48 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కెప్టెన్ వోల్వార్ట్ (42; 37 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్)రాణించింది. తన్జిమ్ బ్రిట్స్ (15; 15 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) ఆదిలోనే ఔటైనా వోల్వార్డ్, అనెకె.. ఆసీస్కు అవకాశం ఇవ్వలేదు. దూకుడుగా ఆడుతూ లక్ష్యాన్ని కరిగించారు. వీరిద్దరు రెండో వికెట్కు 65 బంతుల్లో 96 పరుగులు జోడించారు.
కాగా, సెమీఫైనల్-2లో వెస్టిండీస్తో న్యూజిలాండ్ పోటీపడనుంది. షార్జా వేదికగా ఇవాళ రాత్రి 7.30 ఈ పోరు ప్రారంభం కానుంది. ఈ సెమీస్లో గెలిచిన జట్టు ఆదివారం దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.