సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అఫ్గానిస్థాన్ అద్భుత విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలుండగానే దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి 2-0తో వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. షార్జా వేదికగా జరిగిన రెండో వన్డేలో 177 పరుగుల భారీ తేడాతో అఫ్గానిస్థాన్ రికార్డు విజయం సాధించింది. సౌతాఫ్రికాపై తొలిసారి ద్వైపాక్షిక సిరీస్ను గెలిచింది.
మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 311 పరుగులు చేసింది. గుర్బాజ్ (105; 110 బంతుల్లో, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. అజ్మతుల్లా (86; 50 బంతుల్లో, 5 ఫోర్లు, 6 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. రహ్మత్ (50; 66 బంతుల్లో, 2 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఎంగిడి, బర్గర్, పీటర్, మార్క్రమ్ తలో వికెట్ తీశారు.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్కు శుభారంభం దక్కింది. రియాజ్ హసన్ (29; 45 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్)తో కలిసి గుర్బాజ్ తొలి వికెట్కు 88 పరుగులు జోడించారు. రియాజ్ ఔటైనప్పటికీ రహ్మత్తో కలిసి గుర్బాజ్ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. వన్డేల్లో ఏడో శతకాన్ని అందుకున్నాడు. అయితే సెంచరీ సాధించిన కాసేపటికే పెవిలియన్కు చేరాడు. అనంతరం అజ్మతుల్లా క్రీజులోకి వచ్చిన తర్వాత అఫ్గాన్ ఇన్నింగ్స్ రూపురేఖలు మారిపోయాయి. అజ్ముతుల్లా బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించి జట్టు స్కోరును 300+ను దాటించాడు.

అనంతరం 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 34.2 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. బర్త్డే బాయ్ రషీద్ ఖాన్ (5/19) అయిదు వికెట్లు, ఖరోటె (4/26) నాలుగు వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించారు. కెప్టెన్ బవుమా (38; 47 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. టోని డిజోర్జి (31; 44 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు), మార్క్రమ్ (21; 30 బంతుల్లో, 1 ఫోర్), రీజా హెండ్రిక్స్ (17; 34 బంతుల్లో, 1 ఫోర్) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. సిరీస్లో మిగిలిన నామమాత్రపు ఆఖరి వన్డే ఆదివారం జరగనుంది.