టీ20 క్రికెట్లో యూఎస్ఏ సంచలనం సృష్టించింది. పూర్తి సభ్య దేశంపై తొలి సిరీస్ విజయాన్ని అందుకుంది. స్వదేశంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడు టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. హౌస్టన్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో బంగ్లాపై అమెరికా నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది.
మరో ఎనిమిది రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న వేళ ఈ సిరీస్ విజయం యూఎస్ఏ జట్టులో రెట్టింపు ఉత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని నింపింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 144 పరుగులు చేసింది. కెప్టెన్ మోనన్క్ పటేల్ (42; 38 బంతుల్లో, 4x4, 1x6) టాప్ స్కోరర్.

యునైటెడ్ స్టేట్స్కు శుభారంభం దక్కింది. స్టీవెన్ టేలర్ (31; 28 బంతుల్లో, 3x4, 2x6)తో కలిసి మోనన్క్ పవర్ప్లేలో 42 పరుగులు సాధించాడు. అయితే ఏడో ఓవర్లో వరుస బంతుల్లో టేలర్, వన్డౌన్లో వచ్చిన అండ్రిస్ (డకౌట్)ను రిషాద్ హొస్సేన్ ఔట్ చేసి అమెరికాను దెబ్బకొట్టాడు. కానీ ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన ఆరోన్ జోన్స్ (35; 34 బంతుల్లో, 3x, 1x6)తో కలిసి మోనన్క్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.
అయితే వీరిద్దరు నిదానంగా ఆడటంతో స్కోరుబోర్డు నెమ్మదిగా ముందుకు కదిలింది. ఆఖర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో అమెరికా 144 పరుగులతో సరిపెట్టుకుంది. రిషాద్, షారిఫుల్, ముస్తాఫిజుర్ తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం చేధనలో బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ షాంటో (36; 34 బంతుల్లో, 2x4, 1x6) పోరాడాడు.
ఛేజింగ్లో బంగ్లా ఆదిలోనే వికెట్లు కోల్పోయింది. ఈ దశలో షాంటో స్కోరు బోర్డు ముందకు నడిపించాడు. తౌహిద్ (25; 21 బంతుల్లో, 1x6), షకిబ్ అల్ హసన్ (30; 23 బంతుల్లో, 4x4, 1x6)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. కానీ యునైటెడ్ స్టేట్స్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ బంగ్లాను చిత్తు చేశారు. అలీ ఖాన్ మూడు, సౌరబ్, షాడ్లీ చెరో రెండు వికెట్లు తీశారు. కాగా, టీ20 వరల్డ్ కప్లో గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడాతో పాటు ఆతిథ్య దేశం యూఎస్ఏ ఉంది.