టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ టీమిండియాకు జింబాబ్వే షాక్ ఇచ్చింది. అయిదు టీ20ల సిరీస్లో భాగంగా హరారె వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్పై జింబాబ్వే 13 పరుగుుల తేడాతో విజయం సాధించింది. ప్రపంచకప్ గెలిచిన ఆటగాళ్లు ఎవరూ భారత జట్టులో లేనప్పటికీ శుభ్మన్ గిల్ సారథ్యంలో ఆడిన యువ ఆటగాళ్లు మామూలూ ప్లేయర్లు మాత్రం కాదు. ఐపీఎల్ సత్తాచాటి, రికార్డులు బ్రేక్ చేసిన భవిష్యత్ తారలు.
మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 115 పరుగులు చేసింది. మడాండే (29 నాటౌట్; 25 బంతుల్లో 4×4) టాప్స్కోరర్. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ (4/13) నాలుగు వికెట్లు, వాషింగ్టన్ సుందర్ (2/11) రెండు వికెట్లు తీశారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జింబాబ్వేకు ముకేశ్ కుమార్ ఆదిలోనే షేక్ ఇచ్చాడు. ఓపెనర్ ఇనోసెంట్ కైయాను డకౌట్ చేశాడు. వన్డౌన్లో వచ్చిన బెనెట్ (22; 15 బంతుల్లో, 5 ఫోర్లు)తో కలిసి మరో ఓపెనర్ మద్వీర (21; 22 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు.

కానీ భారత బౌలర్లు క్రమంగా వికెట్లు తీసి జింబాబ్వేను 90/9 స్కోరుతో చేశారు. అయితే ఆఖరి వికెట్కు మడాండే (29 నాటౌట్, 25 బంతుల్లో, 4 ఫోర్లు) కీలక పరుగులు సాధించాడు. అనంతరం ఛేదనలో భారత్ 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. శుభ్మన్ గిల్ (31; 29 బంతుల్లో, 5 ఫోర్లు), వాషింగ్టన్ సుందర్ (27; 34 బంతుల్లో; 1 ఫోర్, 1 సిక్సర్) మినహా ఎవరూ సత్తాచాటలేదు. జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా (3/25), చటార (3/16) మూడు వికెట్లతో సత్తాచాటారు.

జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సికిందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ క్రమంలో సికిందర్ అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో సూర్యకుమార్ యాదవ్తో కలిసి సికిందర్ రజా సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. సికిందర్ 87 మ్యాచ్ల్లో 15 సార్లు, సూర్య 68 మ్యాచ్ల్లో 15 సార్లు ఈ అవార్డు దక్కించుకున్నారు. మరోవైపు ఈ జాబితాలో అగ్రస్థానంలో విరాట్ కోహ్లి ఉన్నాడు. 125 మ్యాచ్ల్లో కోహ్లి 16 సార్లు అవార్డు సాధించాడు.