
జైపూర్ వేదికగా జరగుతున్న విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో హిమాచల్ప్రదేశ్కు తమిళనాడు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ జట్టు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ సెంచరీతో చెలరేగగా, ఇంద్రజిత్ కూడా భారీ స్కోర్ సాధించాడు. చివర్లో షారూక్ ఖాన్ వేగంగా ఆడి విధ్వంసం సృష్టించాడు. దీంతో తమిళనాడు జట్టు 49.4 ఓవర్లలో 314 పరుగులకు ఆలౌట్ అయింది. నిజానికి హిమాచల్ ప్రదేశ్ బౌలర్ల ధాటికి తమిళనాడు జట్టు 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ జట్టు ఓపెనర్లు అపరజిత్ 2, జగదీశన్ 9 పరుగులు మాత్రమే చేశారు. వన్డౌన్లో వచ్చిన సాయి కిషోర్ 18, అశ్విన్ 7 పరుగులకే ఔట్ అయ్యారు. వీరిని రిషి ధావన్, జైస్వాల్, వినయ్ ఔట్ చేశారు.
సెంచరీతో చెలరేగిన దినేశ్ కార్తీక్
ఈ క్రమంలో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, ఇంద్రజిత్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్కు 202 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో దినేష్ కార్తీక్ సెంచరీ పూర్తి చేయగా, ఇంద్రజిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వీరి భాగస్వామ్యాన్ని విడదీయడానికి హిమాచల్ప్రదేశ్ బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో జట్టు స్కోర్ 242 పరుగుల వద్ద ఉండగా 80 పరుగులు చేసిన ఇంద్రజిత్ను దిగ్విజయ్ రంగి ఔట్ చేశాడు. దీంతో దినేష్, ఇంద్రిజిత్ 202 పరుగుల భాగస్వామ్యాన్నికి తెరపడింది. 71 బంతులు ఎదుర్కొన ఇంద్రజిత్ ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఆ వెంటనే జట్టు స్కోర్ 246 పరుగుల వద్ద ఉండగా 116 పరుగులు చేసిన దినేష్ కార్తీక్ను సిద్ధార్థ్ శర్మ ఔట్ చేశాడు. 103 బంతులు ఎదుర్కొన్న కార్తీక్ ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి.
చివర్లో షారూక్ ఖాన్ విధ్వంసం
ఇక చివర్లో షారూక్ ఖాన్ విధ్వంసం సృష్టించాడు. 3 ఫోర్లు, 3 సిక్స్లతో 21 బంతుల్లోనే 42 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అతనికి 22 పరుగులతో కెప్టెన్ విజయ్ శంకర్ అండగా నిలిచాడు. అయితే చివర్లో హిమాచల్ ప్రదేశ్ బౌలర్లు వెంట వెంటనే వికెట్లు తీయడంతో నిర్ణీత ఓవర్లకు మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 314 పరుగుల వద్ద తమిళనాడు ఆలౌట్ అయింది. హిమాచల్ప్రదేశ్ ముందు 315 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. హిమాచల్ప్రదేశ్ బౌలర్లలో పంకజ్ జైస్వాల్ 4, రిషి ధావన్ 3 వికెట్లు తీశారు. దిగ్విజయ్ రంగి, సిద్ధార్థ్ శర్మ, వినయ్ తలో వికెట్ తీశారు.