
హైదరాబాద్: దేశవాళీ రంజీ క్రికెట్ టోర్నీలో విదర్భ చరిత్ర సృష్టించింది. ఇండోర్లోని హోల్కర్ మైదానంలో జరిగిన రంజీ ట్రోఫీ 2017-18 సీజన్ ఫైనల్లో ఢిల్లీపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఏడుసార్లు టైటిల్ విజేతగా నిలిచిన ఢిల్లీ జట్టుపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో విదర్భ జట్టు ఆటగాడు అక్షయ్ వాడ్కర్ (133 బ్యాటింగ్; 262 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సు) కెరీర్లో తొలి సెంచరీతో విదర్భ జట్టుకి తొలి టైటిల్ని అందించాడు. దీంతో 83 ఏళ్ల రంజీ చరిత్రలో తొలిసారి ట్రోఫీని గెలుచుకున్న జట్టుగా విదర్భ అవతరించింది.
తొలి ఇన్నింగ్స్లో ఢిల్లీ 295 పరుగులకే ఆలౌట్ కాగా, అనంతరం బ్యాటింగ్ చేసిన విదర్భ వికెట్ కీపర్ అక్షయ్ వినోద్ వాడ్కర్ అజేయ సెంచరీతో 547 పరుగుల భారీ స్కోరుని సాధించింది. ఇక, రెండో ఇన్నింగ్స్లో ఢిల్లీ జట్టు ఆశించిన మేర రాణించలేకపోయింది.
గౌతమ్ గంభీర్ (36), నితీశ్ రాణా (64), రిషబ్ పంత్ (32) కీలక సమయంలో వికెట్లు చేజార్చుకోవడంతో 280 పరుగులకే ఢిల్లీ కుప్పకూలింది. అనంతరం 29 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ కేవలం 5 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి విజయం సాధించింది. దీంతో మైదానంలో విదర్భ ఆటగాళ్లు గెలుపు సంబరాలు చేసుకున్నారు.
రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్భ జట్టు విజయం సాధించడంలో గుర్బానీ (6/59), అక్షయ్ వాడ్కర్ అజేయ సెంచరీనే కీలకపాత్ర పోషించాయి. ఈ రంజీ సీజన్ ప్రారంభమైన తొలి మ్యాచ్ నుంచే విదర్భ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే.
స్కోరు కార్డు వివరాలు:
ఢిల్లీ తొలి ఇన్నింగ్స్: 295 ఆలౌట్
విదర్భ తొలి ఇన్నింగ్స్: 547 ఆలౌట్
ఢిల్లీ రెండో ఇన్నింగ్స్: 280 ఆలౌట్
విదర్భ రెండో ఇన్నింగ్స్: 32/1
మ్యాచ్ ఫలితం: 9 వికెట్లతో విదర్భ ఘన విజయం
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.