కొలంబో: ఇప్పటికే మూడు మ్యాచ్లు గెలిచాం. ఒక్క ఓటమి ఏం చేయలేదనుకుందో ఏమో.. లంక చేతిలో సఫారీ జట్టు భారీ తేడాతో ఓటమిపాలైంది. బౌలర్లతో పాటు బ్యాట్స్మెన్ కూడా నిర్లక్ష్యం వహించడంతో.. లంక జట్టు భారీ తేడాతో గెలిచి పరువు నిలబెట్టుకుంది. ఈ క్రమంలో ఐదు వన్డేల సిరీస్లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో ఓడినా.. శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ను దక్షిణాఫ్రికా 3-2తో కైవసం చేసుకుంది.
లంక స్పిన్నర్ అఖిల ధనంజయ (6/29) మాయాజాలాన్ని అధిగమించలేక.. ఆదివారం జరిగిన ఆఖరి వన్డేలో సఫారీ జట్టు 178 పరుగుల తేడాతో లంక చేతిలో ఓటమి చవిచూసింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన లంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 299 పరుగులు చేసింది. మాథ్యూస్ (97 నాటౌట్), డిక్వెల్లా (43) రాణించారు. టాప్ ఆర్డర్లో తరంగ (19), పెరీరా (8) స్వల్ప వ్యవధుల్లో ఔటైనా.. డిక్వెల్లా, మెండిస్ (38) మూడో వికెట్కు 50 పరుగులు జోడించారు.
తర్వాత వచ్చిన మాథ్యూస్ నిలకడైన ఆటతీరుతో ఇన్నింగ్స్కు వెన్నెముకగా నిలిచాడు. డిసిల్వా (30)తో కలిసి ఐదో వికెట్కు 53, తిసారా పెరీరా (13)తో కలిసి ఆరోవికెట్కు 52, షనక (21)తో కలిసి ఏడో వికెట్కు 44 పరుగులు జత చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ముల్దెర్, పెహెల్కావో చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 24.4 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది.
డికాక్ (54) టాప్ స్కోరర్. లంక బౌలర్ల ధాటికి ప్రొటీస్ టాప్, మిడిలార్డర్ పెవిలియన్ చేరేందుకు క్యూ కట్టింది. మార్క్రమ్ (20)తో రెండో వికెట్కు 31 పరుగులు జోడించిన డికాక్.. డుమిని (12)తో కలిసి ఐదో వికెట్కు 46 పరుగులు జత చేశాడు. రబాడ (12) కొద్దిసేపు పోరాడాడు. సఫారీ ఇన్నింగ్స్లో ఏడుగురు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. కుమార 2, లక్మల్, డిసిల్వా చెరో వికెట్ తీశారు. ధనంజయకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్; డుమినికి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి.