అహ్మదాబాద్: ఐపీఎల్ 8లో రాజస్థాన్ రాయల్స్కు తొలి ఓటమి ఎదురైంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్... పంజాబ్ ముందు 192 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే, 191 పరుగులు చేసిన పంజాబ్ మ్యాచ్ను టై చేయడంతో సూపర్ ఓవర్లో పంజాబ్ గెలిచింది. ఆధ్యంతం మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఆది నుండి రాజస్థాన్దే ఆధిపత్యం అయినా సూపర్ ఓవర్లో పంజాబ్ను గెలుపు వరించింది.
వరుసగా ఐదు మ్యాచ్ల్లోనూ నెగ్గిన రాజస్థాన్ జోరుకు పంజాబ్ ఆరో మ్యాచులో బ్రేక్ వేసింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగి సూపర్ ఓవర్కు దారి తీసిన మ్యాచ్లో రాయల్స్ను ఓడించింది. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ వికెట్ నష్టానికి 15 పరుగులు చేసింది. క్రిస్ మోరిస్ వేసిన ఓవర్లో షాన్ మార్ష్ (12) మూడు ఫోర్లతో అలరించాడు.
అనంతరం ఆరు బంతుల్లో 16 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ మూడు బంతులే ఆడి ఆరు రన్స్కే రెండు వికెట్లు కోల్పోయింది. జాన్సన్ తొలి బంతికే వాట్సన్ను బౌల్డ్ చేశాడు. తర్వాత వేసిన నోబాల్ను స్మిత్ (5) బౌండ్రీ సాధించాడు. ఆ తర్వాతి బంతికి స్మిత్ సింగిల్ తీయగా మూడో బంతికి ఫాల్క్నర్ రనౌటవడంతో పంజాబ్ ఆటగాళ్ల సంబరాలు మొదలయ్యా యి. సూపర్ ఓవర్లో రెండు వికెట్లు కోల్పోతే ఆలౌటైనట్టే లెక్క. ఈ సీజన్లో ఇదే తొలి సూపర్ ఓవర్ మ్యాచ్.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 191 పరుగులు చేసింది. అజింక్యా రహానె (54 బంతుల్లో 74) అర్ధ శతకంతో చెలరేగాడు. వాట్సన్ (35 బంతుల్లో 45) రాణించాడు. నాయర్ (13 బంతుల్లో 25), హుడా (9 బంతుల్లో 19) మెరుపులు మెరిపించాడు. పంజాబ్ బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీశాడు.
ఇక భారీ లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 191 పరుగులే చేసింది. షాన్ మార్ష్ (40 బంతుల్లో 65) అర్ధ శతకంతో విజృంభించాడు. డేవిడ్ మిల్లర్ (30 బంతుల్లో 54) మెరుపు ఇన్నింగ్స్తో అదరగొట్టా డు. చివర్లో జాన్సన్ (13 నాటౌట్), అక్షర్ (12 నాటౌట్) పోరాడి మ్యాచ్ను సూపర్ ఓవర్కు తీసుకెళ్లారు. షాన్మార్ష్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.