
హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్లో భారత విజయాన్ని చీకటి కమ్మేసింది. నవంబర్ 16(గురువారం) టెస్టు ప్రారంభమైన తొలి రోజు నుంచి చివరి రోజు వరకు చీకటిదే పైచేయి అయింది. ఉత్కంఠ భరితంగా సాగిన తొలి టెస్టు చివరి రోజు భారత్ జట్టులో విజయం ఆశలు రేపగా, శ్రీలంకను తీవ్ర ఒత్తిడికి గురి చేసింది.
ముచ్చటగా మూడు వికెట్లు తీస్తే చాలు... తొలి టెస్టులో కోహ్లీసేన గెలుపు ఖాయమనుకున్న సమయంలో వెలుతురులేమితో ఆట నిలిచిపోయింది. ఈ దశలో 75/7 స్కోరుతో ఓటమికి చేరువైన లంక ఊపిరి పీల్చుకుంది. దీంతో మ్యాచ్ 'డ్రా'గా ముగిసింది. కోహ్లీ సూపర్ సెంచరీ, భువీ, షమీల కళ్లు చెదిరే బౌలింగ్ భారత్ను గెలుపు అంచు వరకు తీసుకెళ్లాయి.
వర్షం కారణంగా తొలి రెండు రోజులు సగానికిపైగా ఓవర్లు తుడిచి పెట్టుకుపోయినప్పటికీ కోల్కతా టెస్టు చివరిరోజుకు మాత్రం ఆసక్తికరంగా మారింది. ఐదో రోజైన సోమవారం.. విరాట్ కోహ్లీ సెంచరీతో చేలరేగడంతో భారత్ 352/8 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. దీంతో ప్రత్యర్ధి ముంగిట 231 పరుగుల లక్ష్యం ఉంచింది.
లక్ష్య ఛేదనలో శ్రీలంక.. భువనేశ్వర్ (4/8), మహ్మద్ షమీ(2/34)ల ధాటికి విలవిలలాడింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఏ దశలోనూ కోలుకోలేదు. వరుస వికెట్లను కోల్పోతూ లక్ష్యచేధనలో తడబడింది. ఈ నేపథ్యంలో ఇంకొన్ని ఓవర్లు పడితే కోహ్లీసేన చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుని ఉండేది.
కోల్కతా టెస్టు హైలెట్స్:
* అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాట్స్మెన్లలో సచిన్ టెండూల్కర్ (100) తర్వాత విరాట్ కోహ్లీ(50) రెండో స్థానంలో ఉన్నాడు.
* ఈడెన్లో గార్డెన్స్లో కోహ్లీకి ఇది తొలి సెంచరీ. ఈ ఏడాది సాధించిన సెంచరీల సంఖ్య 9, అంతకు ముందు కోహ్లీ 2012, 2014లో 8 సెంచరీలు సాధించాడు.
* ఈ సెంచరీతో కోహ్లీ సెంచరీల సంఖ్య 50కి చేరింది. టెస్టుల్లో అతనికిది 18వ సెంచరీ. మొత్తంగా అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మన్ జాబితాలో కోహ్లీ 8వ స్థానంలో నిలిచాడు.
* 100 సెంచరీలతో సచిన్ అగ్రస్ధానంలో ఉండగా... పాంటింగ్ (71), సంగక్కర (63), కలిస్ (62), ఆమ్లా (54), జయవర్దనే (54), లారా (53) కోహ్లీ కంటే (50) ముందు ఉన్నారు.
* టెస్టుల్లో 18వ సెంచరీ సాధించడం ద్వారా కోహ్లీ.. భారత మాజీ క్రికెటర్ వెంగ్సర్కార్(17)ను అధిగమించాడు. భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో కోహ్లీ ఆరో స్థానంలో చేరాడు.
* సచిన్ టెండూల్కర్ (51), రాహుల్ ద్రవిడ్ (36), సునీల్ గవాస్కర్ (34), వీరేంద్ర సెహ్వాగ్ (23), అజహరుద్దీన్ (22) కోహ్లీ కంటే ముందు వరుసలో ఉన్నారు.
* అంతర్జాతీయ కెరీర్లో వేగంగా 50 సెంచరీలు సాధించిన ఆటగాడిగా కోహ్లీ, దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ ఆమ్లా సరసన చేరాడు. ఈ ఇద్దరూ 348 ఇన్నింగ్సుల్లోనే ఈ ఫీట్ను సాధించగా.. సచిన్ 376 ఇన్నింగ్సుల్లో, పాంటింగ్ 420, లారా 465 ఇన్నింగ్సుల్లో 50 సెంచరీల మార్క్ను అందుకున్నారు.
* సొంతగడ్డపై భారత స్పిన్నర్లు ఒక టెస్టు మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా తీయకపోవడం ఇదే తొలిసారి.
* మరోవైపు కాగా మన పేసర్లు స్వదేశంలో జరిగిన మ్యాచ్లో 17 వికెట్లు తీయడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం.
* ఇదిలా ఉంటే గతంలో ఏ ఏడాది లేని విధంగా కోహ్లీ 2017లో 5సార్లు డకౌట్ అయ్యాడు.
* అంతేకాదు ఒకే టెస్టు తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయి రెండో ఇన్నింగ్స్లో సెంచరీ సాధించిన తొలి భారత్ కెప్టెన్గానూ రికార్డుల్లోకి ఎక్కాడు.