బర్మింగ్హామ్: ప్రపంచకప్ టోర్నమెంట్లో ఇంగ్లండ్ ఓ రికార్డును అందుకుంది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో టీమిండియాతో తలపడుతోన్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టు తన ఇన్నింగ్ను అద్భుతంగా ఆరంభించింది. అసాధారణంగా ఆడుతోంది. భారీ స్కోరుపై కన్నేసింది. ఆ దిశలోనే పయనిస్తోంది కూడా. ఇన్నింగ్ను ఆరంభించిన ఇంగ్లండ్ ఓపెనర్లు జేసన్ రాయ్, జానీ బెయిర్స్టో దూకుడుగా ఆడుతున్నారు. తొలి ఓవర్ నుంచే బౌండరీల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఫాస్ట్ బౌలింగ్ను లెక్క చేయట్లేదు. స్పిన్ బౌలింగ్ను అసలే పరిగణనలోకి తీసుకోవట్లేదు. ఎదరుగా బంతిని సంధిస్తోన్న బౌలర్ ఎవరనేది కూడా పట్టించుకోవట్లేదు. దుమ్ము దులిపేస్తున్నారు. కసి తీరా ఆడుతున్నారు. స్కోరుబోర్డును ఉరకలెత్తిస్తున్నారు. ఈ క్రమంలో- ఓ రికార్డును కూడా అందుకుంది ఇంగ్లండ్ టీమ్.
వికెట్ నష్టపోకుండా..
వికెట్ నష్టపోకుండా అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు ఇంగ్లండ్ ఓపెనర్లు. 17వ ఓవర్ వరకు వికెట్ను నష్టపోకుండా 124 పరుగులు చేశారు. టీమిండియాపై ఇంగ్లండ్ సాధించిన ఓ రికార్డుగానే దీన్ని పరిగణించుకోవచ్చు. ప్రస్తుత ప్రపంచకప్ టోర్నమెంట్లో ఓపెనింగ్ స్టాండ్స్లో అత్యధిక పరుగులను జోడించడం ఓ రికార్డుగానే చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ఏ జట్టు కూడా వికెట్ నష్టపోకుండా ఇంత పెద్ద ఎత్తున పరుగులను పిండుకోలేదు మరి! ఇప్పటిదాకా కోహ్లీసేనపై అత్యధిక ఓపెనింగ్ స్టాండ్స్లో అత్యధిక పరుగులు చేసిన జట్టు ఆస్ట్రేలియా. ఆ జట్టు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్ టీమిండియాపై ఓపెనింగ్ స్టాండ్స్లో 61 పరుగులను జోడించారు. అదే ఇప్పటిదాకా అత్యధిక స్కోరు. దీన్ని బ్రేక్ చేసి పడేశారు ఇంగ్లండ్ ఓపెనర్లు జేసన్ రాయ్, జానీ బెయిర్స్టో.
ఇప్పటిదాకా టీమిండియాపై నమోదైన ఓపెనింగ్ స్టాండ్స్లో భారీ స్కోర్..
ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో ఆ జట్టు ఓపెనర్లు జజయ్, గుల్బదీన్ నయీబ్ల జంట 20 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఓపెనర్లు ఇమాముల్ హక్, ఫకర్ జమాన్ 13, దక్షిణాఫ్రికా ఓపెనింగ్ ద్వయం హషీమ్ ఆమ్లా, క్వింటన్ డికాక్ 11 పరుగులు, వెస్టిండీస్ తరఫున క్రిస్ గేల్, సునీల్ యాంబ్రీస్ 10 పరుగులు ఇప్పటిదాకా టీమిండియాపై నమోదైన ఓపెనింగ్ స్టాండ్స్ పరుగుల భాగస్వామ్యం. ఇంగ్లండ్ ఓపెనర్లు దూకుడు ముందు అవేవీ కొరగాకుండా పోయాయి. దీనితోపాటు- తొలి పవర్ ప్లేలో అత్యధికంగా పరుగులను రాబట్టుకున్న రెండో జట్టు కూడా ఇంగ్లండే అయి కూర్చుంది. తొలి పవర్ ప్లే 48 పరుగులను పిండుకున్నారు జేసన్ రాయ్, జానీ బెయిర్ స్టో. ఇంతకుముందు- ఆస్ట్రేలియా టీమ్ భారత క్రికెట్ జట్టుపై తొలి పవర్ 48 పరుగులను రాబట్టుకుంది. పాకిస్తాన్ 38, ఆఫ్ఘనిస్తాన్ 37, దక్షిణాఫ్రికా 34, వెస్టిండీస్ 29 పరుగులను రాబట్టుకుంది.
{headtohead_cricket_3_2}