
జొహన్నెస్బర్గ్: కరోనా వైరస్ (కొవిడ్-19)మహమ్మారిపై పోరాడేందుకు క్రీడాలోకం విరాళాల పరంపర కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కొందరు ఆటగాళ్లు సొంతంగా ఆర్థిక సాయం అందిస్తుండగా.. మరికొందరు ప్లేయర్లు తమకు ఇష్టమైన వస్తువులను వేలం వేయడం ద్వారా వచ్చిన మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నారు. ఇప్పటికే చాలామంది ప్లేయర్లు ఈ కార్యక్రమంలో భాగం కాగా.. ఇప్పుడు తాజాగా దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్మన్ హర్షెల్లే గిబ్స్ కూడా ఈ జాబితాలో చేరాడు.
ఆస్ట్రేలియాతో మ్యాచ్లో 435 పరుగుల ఛేదనలో 175 పరుగులు సాధించిన హర్షెల్లే గిబ్స్ ఆ మ్యాచ్లో ఉపయోగించిన బ్యాట్ను వేలానికి ఉంచాడు. వచ్చిన డబ్బును కరోనాపై పోరాటానికి విరాళంగా అందించనున్నాడు. 2006 జోహెన్నెస్బర్గ్లో జరిగిన వన్డే మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 434 పరుగుల రికార్డు లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందుంచింది. ఛేదనలో విజృంభించిన ఆతిథ్య జట్టు 438 పరుగులు చేసి ఆ భారీ లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచ రికార్డు నమోదు చేసింది. ఇన్నేళ్లుగా ఆ రికార్డు చెక్కుచెదరకుండా అలాగే ఉంది.
ఆ మ్యాచ్లో రెచ్చిపోయిన హర్షెల్లే గిబ్స్ కేవలం 111 బంతుల్లో 175 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా గిబ్స్ ట్విటర్లో పేర్కొటూ... '438 పరుగుల ఛేదనలో నేను ఉపయోగించిన బ్యాట్ను వేలానికి ఉంచుతున్నా. ఇన్నాళ్ల నుంచి ఆ బ్యాట్ను నా వద్దే భద్రంగా ఉంచుకున్నా. కరోనా కోసం అందరూ తమవంతు సాయం చేయండి' అని గిబ్స్ ట్విటర్లో పేర్కొన్నాడు.
న్యూజిలాండ్ క్రికెటర్ హెన్రీ నికోల్స్ 2019 ప్రపంచకప్ ఫైనల్స్లో ధరించిన టీషర్ట్ను యునిసెఫ్కు విరాళంగా ఇవ్వనున్నట్లు తాజాగా తెలిపాడు. కరోనాను తరిమికొట్టేందుకు తన వంతుగా ఈ సాయం అందించి విరాళాలను సేకరించనున్నట్లు మీడియాతో వెల్లడించాడు. ' హెన్రీ నికోల్స్ మాట్లాడుతూ.. ' కరోనాను తరిమికొట్టేందుకు నా వంతుగా ఏదైనా సాయం చేయాలనుకున్నా. బాగా ఆలోచించి ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ధరించిన హాప్ స్లీవ్ టీషర్ట్పై మా టీమ్ సహచర ఆటగాళ్లతో సంతకం చేయించి యునిసెఫ్(యునైటెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్)కు విరాళం ఇవ్వాలనుకున్నా. ప్రజలు స్వచ్చందంగా తమ వంతుగా విరాళం ఇచ్చేలా ప్రోత్సహించేదుకే ఈ పని చేస్తున్నా' అని అన్నాడు.