వాలిమై అప్డేట్ ప్లీజ్:
ప్రస్తుతం సౌథాంప్టన్ వేదికగా ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా మైదానంలోకి ప్రేక్షకులను అనుమతించని.. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) పరిమిత సంఖ్యలో ఫైనల్ మ్యాచుకు అనుమతిని ఇచ్చింది. దీంతో అభిమానులు సందడి చేశారు. టెస్ట్ మ్యాచ్ మూడో రోజు (ఆదివారం)న తమిళ హీరో అజిత్ కుమార్ అభిమాని ఒకరు.. 'వాలిమై' సినిమా అప్డేట్స్ అడుగుతూ ఫ్లకార్డు చూపించాడు. ఈ దృశ్యం అక్కడి కెమెరాల్లో రికార్డు అయింది. ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సందర్భంగా కూడా:
గతంలోనూ భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్తో పాటు ఇంగ్లీష్ ఆల్రౌండర్ మొయిన్ అలీని ఇదే సినిమా గురించి ఫ్యాన్స్ అడిగారు. అప్పుడు అలీకి అర్ధం కాకపోయినా.. అసలు విషయం తెలిసిన అశ్విన్ వారికి బదులిచ్చాడు. అభిమానుల కోరిక మేరకు అతి త్వరలోనే వాలిమై అప్డేట్ చిత్ర బృందం ఇవ్వనుందట. ఈ సినిమాలో అజిత్ సరసన హ్యూమా ఖురేషీ నటిస్తున్నారు. యువ నటుడు కార్తికేయ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూరుస్తున్నారు.

ఆట ఇంకా మొదలవ్వలేదు:
ఇక డబ్ల్యూటీసీ ఫైనల్కు వరుణుడు అడ్డంకిగా మారాడు. నాలుగో రోజు ఆట ఇంకా మొదలవ్వలేదు. ఉదయం నుంచి సౌథాంప్టన్లో వర్షం కురుస్తూనే ఉంది. అప్పుడప్పుడు కాస్త తగ్గినట్టు అనిపించినా.. జల్లులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మైదానంలో పిచ్పై కప్పిన కవర్లపై నీరు నిలిచింది. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. అక్కడక్కడా వరద నీరు చేరింది. వర్షం తగ్గే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. దాంతో ఆటగాళ్లు తమ వ్యాపకాల్లో మునిగిపోయారు. న్యూజిలాండ్ క్రికెటర్లు టేబుల్ టెన్నిస్ ఆడుకుంటున్నారు. మరికొందరు ముచ్చట్లు పెడుతున్నారు. ఇంకొందరు డ్రస్సింగ్ రూమ్ బాల్కనీల్లో వెచ్చని కాఫీలు ఆస్వాదిస్తున్నారు.

రద్దయ్యే అవకాశాలు:
నాలుగో రోజు మొత్తం ఆడపా దడపా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడంతో ఆట రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ తొలి ఇన్నింగ్స్లో 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. భారత స్కోరుకు ఇంకా 116 పరుగుల దూరంలో నిలిచింది. కేన్ విలియమ్సన్ (12 బ్యాటింగ్), రాస్ టేలర్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ 217 రన్స్ చేసి ఆలౌట్ అయింది. అజింక్య రహానే (49; 117 బంతుల్లో 5x4), విరాట్ కోహ్లీ (44; 132 బంతుల్లో 1x4) టాప్ స్కోరర్లు.


Click it and Unblock the Notifications












