రాజ్కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టీ20లో తను చేసిన తొలి శతకం తనకు ఆనందాన్ని ఇవ్వలేదని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ చేతిలో ఓటమి పాలవడం తనకు బాధనే మిగిల్చిందని అన్నారు.
'ఏ దశలోనూ సెంచరీ గురించి ఆలోచించలేదు. జట్టు స్కోరు 170 కావడాన్నే లక్ష్యంగా పెట్టుకున్నా. ఆఖర్లో శతకం చేసుకునే అవకాశం దక్కింది. కానీ జట్టు ఓడిపోవడంతో నాకేమాత్రం ఆనందంగా లేదు' అని కోహ్లీ పేర్కొన్నాడు.
ఆదివారం జరిగిన మ్యాచ్ లో కోహ్లీ (100 నాటౌట్; 63 బంతుల్లో 11×4, 1×6) కెరీర్లో తొలి టీ20 సెంచరీ చేసినా అది వృథానే అయింది. గుజరాత్ లయన్స్ 6 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. విరాట్ కోహ్లీ శతకంతో అదరగొట్టినా గుజరాత్ లయన్స్ చేతిలో బెంగళూరుకు ఓటమి తప్పలేదు.

ఆదివారం మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. కోహ్లి సెంచరీ సాయంతో 20 ఓవర్లలో 180/2 స్కోరు చేసింది. కాగా, దినేశ్ కార్తీక్ (50 నాటౌట్; 39 బంతుల్లో 3×4) సమయోచిత ఇన్నింగ్స్తో గుజరాత్ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
కాగా, గేల్ తదుపరి మ్యాచ్ కి అందుబాటులో ఉంటాడని కోహ్లీ తెలిపాడు. బ్యాటింగ్ తోనే మ్యాచ్ గెలవలేమని, బౌలింగ్ కూడా ముఖ్యమేనని కోహ్లీ చెప్పాడు. తమ జట్టు బౌలర్లు మరింత మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉందని తెలిపాడు.
ఇది ఇలా ఉండగా, కోహ్లీ సెంచరీ చేయడం పట్ల సహచర ఆటగాడు, గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేష్ రైనా ఆనందం వ్యక్తం చేశాడు. తమ జట్టు ఆటగాళ్లు సమష్టిగా రాణించడంతోనే గెలుపు సాధ్యమైందని తెలిపాడు.