హైదరాబాద్: బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక బుధవారం (మార్చి 8)న కన్నుల పండుగగా జరిగింది. బెంగుళూరులోని రిట్జ్ హోటల్లో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమానికి క్రీడా ప్రముఖలందరూ హాజరయ్యారు. వీరితో పాటు టీమిండియా, అవార్జు విజేతలు ఈ ఫంక్షన్కు హాజరయ్యారు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పాలీ ఉమ్రిగర్ అవార్డును, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 'దిలీప్ సర్దేశాయ్' అవార్డును అందుకున్నారు. పాలీ ఉమ్రిగర్ అవార్డును మూడుసార్లు అందుకున్న ఏకైక క్రికెటర్గా కోహ్లి గుర్తింపు పొందాడు. 2015-16 సీజన్లో అద్భుత ప్రదర్శనకు గాను ఈ అవార్డు వరించింది.
వెస్టిండిస్ పర్యటన నుంచి ఇప్పటివరకు అద్భుత ప్రదర్శన కనబర్చిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను కల్నల్ సీకే నాయుడు అవార్డును కూడా వరించింది. వెస్టిండిస్తో 2016లో జరిగిన నాలుగు టెస్టుల సిరిస్లో అశ్విన్ 17 వికెట్లు తీసుకున్న సంగతి తెలిసిందే.

భారత మహిళా క్రికెట్ జట్టు సారథి మిథాలీ రాజ్కు 'బెస్ట్ ఉమన్ క్రికెటర్' అవార్డు దక్కింది. రాజిందర్ గోయెల్, పద్మాకర్ శివాల్కర్లకు కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం దక్కగా, శాంత రంగస్వామికి మహిళల కేటగిరీలో బీసీసీఐ జీవిత సాఫల్య పురస్కారం లభించింది.
ఇక టైగర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ స్మారక ఉపన్యాసాన్ని భారత మాజీ వికెట్కీపర్ ఫారుఖ్ ఇంజినీర్ వెలువరించారు. ఈ ఉపన్యాసంలో లెజెండరీ కెప్టెన్ అయిన అలీఖాన్ పటౌడీని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ అవార్డుల వేడుకకు క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ జేమ్స్ సదర్లాండ్ కూడా హాజరయ్యారు.
బీసీసీఐ వార్షిక అవార్డుల పూర్తి జాబితా:
* కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం: రాజిందర్ గోయెల్, పద్మాకర్ శివాల్కర్
* బీసీసీఐ జీవిత సాఫల్య పురస్కారం: శాంతనా రంగస్వామి
* బీసీసీఐ ప్రత్యేక అవార్డులు: వివి కుమార్, రమాకాంత్ దేశాయ్ (చనిపోయారు)
* పాలీ ఉమ్రిగర్ అవార్డు: విరాట్ కోహ్లీ
* దిలీప్ సర్దేశాయ్ అవార్డు (వెస్టిండిస్ పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసిన క్రికెటర్): రవిచంద్రన్ అశ్విన్
* లాలా అమర్నాథ్ అవార్డు (రంజీ బెస్ట్ఆల్రౌండర్): జలజ్ సక్సేనా (మధ్యప్రదేశ్)
* లాలా అమర్నాథ్ అవార్డు (దేశవాళీ వన్డేల బెస్ట్ ఆల్రౌండర్): అక్షర్ పటేల్ (గుజరాత్)
* మాధవరావు సింధియా అవార్డు (రంజీల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్): శ్రేయస్ అయ్యర్ (ముంబై)
* మాధవరావు సింధియా అవార్డు (రంజీల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్): షాబాజ్ నదీమ్ (జార్ఖండ్)
* ఎంఏ చిదంబరం ట్రోఫీ (అండర్-23 విభాగంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్): జయ్ జి.బిస్తా (ముంబై)
* ఎంఏ చిదంబరం ట్రోఫీ (అండర్-23 విభాగంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్): సత్యజీత్ బచ్చవ్ (మహారాష్ట్ర)
* ఎన్కేపీ సాల్వే అవార్డు (అండర్-19 విభాగంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్): అర్మాన్ జాఫర్ (ముంబై)
* ఎన్కేపీ సాల్వే అవార్డు (అండర్-19 విభాగంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్): నినద్ రథ్వా (బరోడా)
* రాజ్సింగ్ దుంగార్పూర్ అవార్డు (అండర్-16 విభాగంలో అత్యధిక పరుగుల చేసిన బ్యాట్స్మన్): అభిషేక్ శర్మ (పంజాబ్)
* రాజ్సింగ్ దుంగార్పూర్ అవార్డు (అండర్-16 విభాగంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్): అభిషేక్ శర్మ (పంజాబ్)
* జగ్మోహాన్ దాల్మియా (బెస్ట్ ఉమన్ క్రికెటర్ సీనియర్ విభాగంలో): మిథాలీ రాజ్
* జగ్మోహాన్ దాల్మియా (బెస్ట్ ఉమన్ క్రికెటర్ జూనియర్ విభాగంలో): దీప్తి శర్మ (ఉత్తర ప్రదేశ్)
* దేశవాళీ క్రికెట్లో బెస్ట్ అంపైర్ అవార్డు: నితిన్ మీనన్;
* దేశవాళీ టోర్నీలో ఉత్తమ ప్రదర్శన అవార్డు: ముంబై