
2020 సీజన్లో సత్తా చాటిన అన్క్యాప్డ్ ప్లేయర్ ఇషాన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్... ఈ మెగా టోర్నీ ఎంతో మంది యువ క్రికెటర్లను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇక భారత జట్టుకు ఆడాలని కలలు కంటున్న యువ క్రికెటర్లకు ఈ టోర్నీ ఒక అద్భుతమైన వేదికగా నిలిచింది. ప్రపంచపు టాప్ క్రికెటర్లతో కలిసి ఈ యువ క్రికెటర్లు ఆడటం అదృష్టంగా భావిస్తారు. ప్రస్తుతం ఐపీఎల్ 13వ సీజన్ నడుస్తోంది. ఇప్పటికే కొందరు అన్క్యాప్డ్ ప్లేయర్లు తమ సత్తా చాటారు. భారత జట్టుకు ఆడకుండా ఇలా దేశవాలీ క్రికెట్లో ఆడేవారిని అన్క్యాప్డ్ ప్లేయర్లుగా పిలుస్తాము. ఇక్కడ సత్తా చాటాక భారత జట్టులో స్థానం సంపాదిస్తారు. ఇక ఈ ఐపీఎల్లో ఇప్పటి వరకు అత్యధిక స్కోరు సాధించిన అన్ క్యాప్డ్ ప్లేయర్గా ఇషాంత్ కిషన్ నిలిచాడు. ముంబై తరపున ఆడుతున్న ఈ యువకెరటం సెప్టెంబర్ 28న బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 56 బంతుల్లో 99 పరుగులు పిండుకున్నాడు. ఇక గత సీజన్లలో కూడా అన్క్యాప్డ్ ప్లేయర్లు తమ సత్తా చాటారు.

2010లో సత్తా చాటిన నమాన్ ఓజా
ఐపీఎల్లో సత్తా చాటిన అన్క్యాప్డ్ ప్లేయర్లలో ముందుగా చెప్పుకోవాల్సింది నమాన్ ఓజా గురించి. 2009వ సీజన్లో నమాన్ ఓజా రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఆడిన రెండో ఆటలోనే అర్థ సెంచరీ బాదాడు. ఇక అప్పటి నుంచి 10 సీజన్లలో ఆడిన నమాన్ ఓజా మొత్తం మూడు వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఆడాడు. 2010 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పై 94 పరుగులు చేశాడు. అప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్నాడు. ఈ ఇన్నింగ్స్ తనకెంతో స్పెషల్ అని చెబుతుంటాడు. ఎందుకంటే అప్పటి చెన్నై జట్టులోని అగ్రశ్రేణి బౌలర్లు అయిన ముత్తయ్య మురళీధరన్, బోలింగర్, ఆల్బే మోర్కెల్లకు చుక్కలు చూపించాడు.

పంజాబ్ ఆటగాడు మనన్ ఓరా మెరుపులు
ఇక 2013 ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కొనుగోలు చేసిన మరో అన్క్యాప్డ్ ఆణిముత్యం మనన్ ఓరా. అరంగేట్ర మ్యాచ్లోనే 26 బంతుల్లో 43 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. అంతేకాదు సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో 95 పరుగులు బాది తన సత్తా ఏంటో చాటాడు. ఆ మ్యాచ్లో 160 పరుగులు చేయాల్సి ఉండగా అప్పటికే పంజాబ్ ఆరు వికెట్ల నష్టానికి 80 పరుగులు మాత్రమే చేసింది. అయితే గెలుపు దిశగా పంజాబ్ జట్టును తీసుకొచ్చినప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఐదు పరుగుల తేడాతో పంజాబ్ ఓటమి చూసింది. అయినప్పటికీ క్రికెట్ పండితులంతా ఓరా ఆటతీరును ప్రశంసించారు.

ఐపీఎల్లో తొలి సెంచరీ చేసిన భారత ఆటగాడు మనీష్ పాండే
మనీష్ పాండే... 2009 ఐపీఎల్ సీజన్లో సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఓపెనింగ్ చేసిన ఈ యువ క్రికెటర్ 114 పరుగులు సాధించి నాటౌట్గా నిలిచాడు. ఆ సమయంలో చాలామంది అంతర్జాతీయ క్రికెటర్లతో కలిసి మనీష్ పాండే సత్తా చాటాడు. ఇక ఆ సమయంలో భారత్లో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు ఉన్నందున టోర్నీ సౌతాఫ్రికాకు తరలిపోయింది. తాను విదేశాల్లో ఈ శతకం బాదడంతో ఆ ఇన్నింగ్స్ మరింత ఆకట్టుకుంది. ఆ తర్వాత 2015లో తొలిసారిగా భారత జట్టుకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ తరపున మనీష్ పాండే ఆడుతున్నాడు.

ఐపీఎల్లో సక్సెస్ అయిన పాల్ వాల్తటీ కానీ...
పాల్ వాల్తటీ.. మరో అన్క్యాప్డ్ ప్లేయర్. ఐపీఎల్లో అయితే సక్సెస్ చూశాడు కానీ.. ఓవరాల్ క్రికెట్ కెరీర్లో మాత్రం ముందుకు సాగలేకపోయాడు. పంజాబ్ తరపున ఆడిన ఈ ఆటగాడు... చెన్నై సూపర్కింగ్స్ పై 63 బంతుల్లో 120 పరుగులు సాధించిం దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఇప్పటి వరకు ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ సాధించిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. 2011లో కనబర్చిన ప్రతిభను ఇతర సీజన్లో చూపకపోవడంతో ఏడవ సీజన్ నుంచి కనుమరుగైపోయాడు. అదే సమయంలో భారత్కు ప్రాతినిథ్యం వహించే ఛాన్స్ కూడా కోల్పోయాడు.
మొత్తానికి ఇవండీ.. అన్క్యాప్డ్ ప్లేయర్స్ సృష్టించిన సునామీ రికార్డులు. మరి ఈ సారి ఎంతమంది అన్క్యాప్డ్ ప్లేయర్లు సత్తా చాటి భారత జట్టుకు ఎంపిక అవుతారో చూడాలి మరి..


Click it and Unblock the Notifications
