ఆ ఆరు జట్లివే..
ఈ సీజన్లో ప్లేఆఫ్స్కు అర్హత సాధించలేని ఆరు జట్లు ఇవ్వాళ తమ పెట్టే, బేడా సర్దేస్తాయి. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా గుర్తింపు పొందిన ముంబై ఇండియన్స్, సెకెండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్- ప్లేఆఫ్స్లో చోటు దక్కించుకోలేకపోయాయి. వాటి స్థానాన్ని కొత్తగా ఈ సీజన్తోనే ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఆక్రమించుకున్నట్టయింది. సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, కోల్కత నైట్రైడర్స్, ఢిల్లీ కేపిటల్స్.. ఇంటిబాట పట్టనున్నాయి.
ప్లేఆఫ్స్కు చేరిన టీమ్స్ ఇవే..
ఈ సీజన్లో మొత్తం నాలుగు జట్లు ప్లేఆఫ్స్కు అడుగు పెట్టాయి. ఈ సీజన్తో తమ ఐపీఎల్ ప్రస్థానాన్ని ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ ఆడనున్నాయి. ఈ రెండు జట్లు కూడా తమ ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. పాయింట్ల పట్టికలో తొలి, మూడో స్థానంలో నిలిచాయి. ఈ రెండింటితో పాటు రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ప్లేఆఫ్స్కు అర్హత సాధించాయి. గుజరాత్ టైటాన్స్-20, రాజస్థాన్ రాయల్స్-18, లక్నో సూపర్ జెయింట్స్-18, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-16 పాయింట్లతో ప్లేఆఫ్స్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాయి.
తొలి క్వాలిఫయర్..
తొలి క్వాలిఫయర్ ఈ నెల 24వ తేదీన మంగళవారం ఉంటుంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్, సంజు శాంసన్ నాయకత్వాన్ని వహిస్తోన్న రాజస్థాన్ రాయల్స్.. తొలి క్వాలిఫయర్లో తలపడతాయి. సాయంత్రం 7:30 గంటలకు కోల్కతలోని ఈడెన్ గార్డెన్స్లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. రెండో క్వాలిఫయర్లో ఆడుతుంది.
25న ఎలిమినేటర్..
25వ తేదీన బుధవారం నాడు ఎలిమినేటర్. ఇందులో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ కొట్టనున్నాయి. ఈ మ్యాచ్ నాకౌట్తో సమానం. ఓడిన జట్టు టోర్నమెంట్ నుంచి వైదొలగిపోతుంది. గెలిచిన జట్టు ఫైనల్స్కు అర్హత సాధించినట్టు కాదు. రెండో క్వాలిఫయర్ అగ్నిపరీక్షను ఎదుర్కొనాల్సి ఉంటుంది. తొలి క్వాలిఫయర్లో గెలిచిన జట్టుతో తలపడుతుంది. ఓడిన జట్టు ఇంటికే. అందులో గెలిస్తేనే- ఫైనల్స్కు అర్హత సాధిస్తుంది. రెండో క్వాలిఫయర్- ఏ జట్ల మధ్య ఉంటుందనేది ఈ రెండు మ్యాచ్లు ముగిసిన తరువాతే స్పష్టమౌతుంది. రెండో క్వాలిఫయర్ ఈ నెల 27వ తేదీన ఉంటుంది.
వేదికలివే..
తొలి క్వాలిఫయర్- కోల్కత ఈడెన్ గార్డెన్స్లో షెడ్యూల్ అయింది. 24వ తేదీన సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్. ఈ సీజన్లో మహారాష్ట్రను దాటి మ్యాచ్లను నిర్వహించడం ఇదే తొలిసారి అవుతుంది. ఈ మ్యాచ్ ఒక్కటే ఈడెన్ గార్డెన్స్లో ఉంటుంది. లీగ్ దశ మొత్తం ముంబై, నవీ ముంబై, పుణేల్లోని స్టేడియాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఇవ్వాళ జరిగే సన్రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ చివరి లీగ్ మ్యాచ్ జరిగేది కూడా ముంబై వాంఖెడె స్టేడియంలోనే.
ఎలిమినేటర్ సహా..
ఎలిమినేటర్, రెండో క్వాలిఫయర్ సహా ఐపీఎల్ 2022 ఫైనల్స్ జరిగేది అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో. ఎలిమినేటర్ బుధవారం సాయంత్రం 7:30 గంటలకు ఈ స్టేడియంలోనే షెడ్యూల్ అయింది. 27వ తేదీన జరిగే రెండో క్వాలిఫయర్ కూడా ఇక్కడే. అనంతరం 29వ తేదీన ఫైనల్స్కు కూడా నరేంద్ర మోడీ స్టేడియమే ఆతిథ్యాన్ని ఇస్తుంది. ఫైనల్స్ మాత్రం రాత్రి 8 గంటలకు ఆరంభమౌతుంది. ఫైనల్స్ వేడుకలను నిర్వహించబోతున్నందున ఈ మార్పు చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్.